Breaking News

లండన్‌ భారత హైకమిషన్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడిచేసిన పాకిస్థానీలు


కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పిస్తోన్న ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా మరోసారి వీధుల్లో పాక్ సంతతికి చెందిన బ్రిటన్ పౌరులు మంగళవారం నిర్వహించిన ర్యాలీలో భారత హైకమిషనర్ కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. ఈ సందర్భంగా లండన్‌లోని భారత రాయబార కార్యాలయంపై రాళ్లతో దాడిచేయడం గమనార్హం. ‘కశ్మీర్ ఫ్రీడమ్ మార్చ్’ పేరిట బ్రిటిష్ కశ్మీరీ గ్రూపులు నిర్వహించిన ర్యాలీకి బ్రిటన్‌లోని అన్ని ప్రాంతాల నుంచి 10,000 మందికి పైగా పాకిస్థానీలు తరలివచ్చారు. లేబర్ పార్టీకి చెందిన కొంత మంది ఎంపీల నేతృత్వంలోని బ్రిటన్ పార్లమెంటు వద్దకు ర్యాలీగా వెళ్తున్న వీరు భారత హైకమిషనర్ భవనంపై దాడిచేసి కిటకీలను ధ్వంసం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, ఖలీస్థాన్ జెండాలతోపాటు ‘కశ్మీర్‌లో దాడులకు స్వస్తిపలకాలి’ ‘ఆక్రమణను అరికట్టాలి’ ‘కశ్మీర్ విషయంలో ఐరాస చర్యలు తీసుకోవాలి’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. కశ్మీర్ ప్రజలకు ఐక్యరాజ్యసమితి న్యాయం చేయనంత వరకూ బ్రిటన్ నగరాల్లో ఆందోళన నిర్వహిస్తామని, పార్లమెంటు నోరు మూయించడానికి ప్రయత్నించగలరేమో కానీ, ప్రజల నోరు కాదు.. ద్వైపాక్షిక చర్చలకు కాలం చెల్లిపోయిందని, అంతర్జాతీయంగా బహుముఖ పరిష్కారానికి సమయం ఆసన్నమైందంటూ’ లేబర్ పార్టీ నేత, ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన బర్మింగ్‌హమ్ హోగ్డే హిల్ ఎంపీ లియామ్ బైర్నే వ్యాఖ్యానించారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా, సమాచార వ్యవస్థల పునరుద్దరణ, మానవ హక్కుల కార్యకర్తలను అనుమతించేలా భారత్‌పై కామన్వెల్త్, ఐరాసలో ఒత్తిడి తీసుకురావడానికి బ్రిటన్ ప్రభుత్వం తక్షణమే ప్రతినిధులను నియమించేందుకు ఎగువ సభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నామని, దీనికి అవసరమైన సభ్యుల మద్దతు కూడగడుతున్నట్టు బైర్నే వెల్లడించారు. మంగళవారం నాటి ఆందోళనలో పాక్ సంతతి బ్రిటిషర్లతోపాటు పీఓకే మూలాలున్న పౌరులు.. ఖలిస్థాన్ వేర్పాటువాద సిక్కులు కూడా మద్దతు తెలిపారని ఆమె అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత గత 30 రోజులుగా కశ్మీర్‌‌ను పూర్తిగా నిర్బంధంలోకి తీసుకున్నారని ఎంపీ ఆరోపించారు. పార్లమెంట్ స్క్యేర్‌లో మహాత్మా గాంధీ విగ్రహం చేతుల్లో పీఓకే జెండాను ఉంచి అక్కడ నుంచి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఆందోళనకారులు బారికేడ్లను దాటుకుని భారత రాయబార కార్యాలయంపై కోడిగుడ్లు, టమోటాలు, రాళ్లు, షూ, పొగబాంబులతో దాడిచేశారు. ఈ దాడితో భవనంలోని పలు కిటీకిల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలను భారత హైకమిషన్ కార్యాలయం ట్విట్టర్‌లో షేర్ చేసింది. లండన్‌లో భారత్ హైకమిషన్ కార్యాలయం వద్ద మరో హింసాత్మక ఆందోళన సెప్టెంబరు 3న చోటుచేసుకుందని, పరిసరాల్లో నష్టం జరిగిందని ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఈ ఘటనకు కారకులైనవారిలో ఇద్దర్ని అరెస్టు చేసినట్టు లండన్ మెట్రోపాలిటిన్ పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే లండన్ మేయర్, పాక్ సంతతికి చెందిన సిద్దిఖ్ ఖాన్ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యల అనైతికమని ఆయన వ్యాఖ్యానించారు. గత మూడు వారాల్లో లండన్‌లో భారత రాయబార కార్యాలయంపై దాడిచేయడం ఇది రెండోసారి. ఆగస్టు 15న ఖలిస్థాన్, కశ్మీర్ జెండాలను చేతబట్టుకుని ర్యాలీగా వచ్చిన ఆందోళనకారులు హైకమిషన్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. స్వాతంత్రదినోత్సవ వేడుకలు జరుపుకుంటుండగా ఈ దాడికి పాల్పడ్డారు.


By September 04, 2019 at 12:36PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmir-protesters-second-time-targeted-indian-high-commission-in-london/articleshow/70973075.cms

No comments