Breaking News

‘పాక్ ప్రధాని అందరి తలుపులూ తట్టి కార్టూనిస్ట్‌లకు పని కల్పిస్తున్నారు’


ముంబయిలోని మజ్‌గావ్ డాక్ నిర్మించిన స్కారీన్ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గమి ఐఎన్ఎస్ ఖండేరీ, యుద్ధ నౌక ఐఎన్ఎస్ నీలగిరి శనివారం నౌకాదళంలోకి చేరాయి. వీటిని ముంబయి తీరంలో ప్రారంభించిన కేంద్ర రక్షణ మంత్రి జాతికి అంకింతం చేశారు. ఈ సందర్భంగా ఆయన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభలో ప్రసగించిన మర్నాడే రాజ్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం విశేషం. ప్రతి దేశం తలుపు తట్టి పాక్‌ ప్రధాని సాధించింది ఏమీ లేదని.. కేవలం కార్టూనిస్టులకు పని కల్పిస్తున్నారని రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎద్దేవా చేశారు. పాక్‌ కుట్రలను దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, తీర ప్రాంతాల్లో ముంబయి తరహా దాడులకు దాయాది ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. పాకిస్థాన్ కుటిల ప్రయత్నాలను భారత సైన్యం భగ్నం చేస్తుందని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. ఖండేరీ చేరికతో భారత నౌకాదళం మరింత బలోపేతం అయ్యిందనే విషయాన్ని పాకిస్థాన్ అవగాహన చేసుకోవాలని హితవు పలికారు. త్రివిధ దళాలను మరింత పటిష్ఠం చేసేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని తెలిపారు. ప్రాంతీయ శాంతికి విఘాతం కలిగిస్తున్న శక్తుల్ని నావికాదళం నిర్వీర్యం చేస్తుందని హెచ్చరించారు. సొంతంగా జలాంతర్గాముల్ని తయారు చేసుకొనే సామర్థ్యం కలిగిన కొన్ని దేశాల్లో భారత్‌ ఒకటని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్‌లో నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమంతో భారత్ సూపర్‌పవర్‌గా అవతరించిందనే విషయాన్ని ప్రపంచం గుర్తించిందని తెలిపారు. అమెరికాకు చెందిన అగ్రనేతలు మోదీకి ఘనస్వాగతం పలికిన విధానం.. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత ప్రభుత్వ సామర్థ్యాన్ని కొనియాడారని అన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రగతికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను అంతర్జాతీయ సమాజం మద్దతు తెలుపుతుంటే, పాకిస్థాన్ ప్రధాని మాత్రం ప్రతి దేశం తలుపుతట్టి కార్టూనిస్ట్‌లకు పనికల్పిస్తున్నారని విమర్శించారు. నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుకొనే చర్యల్లో భాగంగా ఆరు స్కార్పీన్‌ శ్రేణి జలాంతర్గాముల నిర్మాణానికి భారత్‌ సిద్ధమైంది. 2017 డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన ఐఎన్‌ఎస్‌ కల్వరీ మొదటిది కాగా, తాజాగా చేరిన ఖండేరీ రెండోది. ఫ్రాన్స్‌కు చెందిన నావల్‌ గ్రూప్‌ ఖండేరీ డిజైన్‌ను రూపొందించగా మజ్‌గావ్ డాక్ దీనిని నిర్మించారు. ఐఎన్‌ఎస్‌ ఖండేరీని సైలెంట్‌ కిల్లర్‌‌గా కూడా పిలుస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐఎన్‌ఎస్‌ ఖండేరీ పొడవు 67.5 మీటర్లు. నాలుగు ఎంటీయూ 12 వీ 396,84 ఎస్‌ఈ 360 ఇంజిన్లు, భారీ బ్యాటరీలు ఇందులో ఉంటాయి. సముద్రగర్భంలో 20 నాటికల్‌ మైళ్ల (37 కి. మీ) వేగంతో, 350 మీటర్ల లోతులో రోజుల తరబడి ఏకధాటిగా ప్రయాణించగలదు. ఐఎన్‌ఎస్‌ ఖండేరీని శత్రునౌకలు గుర్తించడం అత్యంత కష్టం.


By September 28, 2019 at 01:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/defence-minister-rajnath-singh-slams-pakistan-pm-going-door-to-door-is-contentor-cartoonists/articleshow/71347913.cms

No comments