Breaking News

మద్దతుగా నిలిచినందుకు థ్యాంక్స్.. భారతీయుల కలల స్ఫూర్తితో సాగుతాం: ఇస్రో


చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌-2 చివరి మెట్టుపై నిలిచిపోయిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగుతూ 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోవడంతో నిరాశ చెందింది. అయితే, ఈ ప్రయోగం 95 శాతం విజయవంతం కాగా, కేవలం 5 శాతం మాత్రమే విఫలమైంది. ఈ ప్రయోగం కోసం పనిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్తు భారతావని మద్దతుగా నిలిచింది. ఇస్రో సాధించిన విజయం తక్కువేం కాదని, భవిష్యత్తులో చంద్రుడిని అందుకుంటామని భరోసా ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ ఇస్రో కృతజ్ఞతలు తెలిపింది. Read Also: ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన ఇస్రో.. ‘మాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ కృతజ్ఞతలు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, కలల స్ఫూర్తితో మేము మరింత ముందుకు సాగుతాం’ అని ఇస్రో పేర్కొంది. చంద్రుడి ఉపరితలపై ఉన్న ఓ కొండ నుంచి మరో కొండకు మానవుడు దూకుతున్నట్టు గ్రాఫిక్‌ ఫోటోను షేర్ చేస్తూ, ధన్యవాదాలు తెలిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అధ్యయనానికి చంద్రయాన్‌-2 ప్రాజెక్టును ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. జులై 22న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3 ద్వారా చంద్రయాన్‌-2 నింగిలోకి పంపగా, ఆ తర్వాత ఒక్కో దశ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ విడిపోయింది. ఈ క్రమంలో విక్రమ్‌ చంద్రుడిపై దిగడానికి 2.1 కిలోమీటర్ల దూరం ఉండగా భూకేంద్రంతో దానికి సంబంధాలు తెగిపోయాయి. Read Also: అప్పటి నుంచి విక్రమ్‌ ల్యాండర్‌తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సైతం సాయపడుతోంది. అయితే, ఇస్రో చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్ అయిన విక్రమ్ ల్యాండర్ పరిసరాల్లో నాసాకు చెందిన లూనార్ ఆర్బిటర్ మంగళవారం ఫోటోలు తీస్తుందని భావించినా, వాతావరణం అనుకూలించలేదు.


By September 18, 2019 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isro-saying-thanks-to-indians-for-standing-by-us-as-vikram-lander-remains-silent/articleshow/71178860.cms

No comments