Breaking News

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన: లారీ ఓనర్‌కి రూ.6.53 లక్షల జరిమానా!


సెప్టెంబరు 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారుల జేబులు గుళ్లవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వేసే జరిమానాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పది రోజుల కిందట ఢిల్లీలో ఓ ట్రక్కు ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిందని పేర్కొంటూ రవాణా శాఖ అధికారులు 1.43 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ట్రక్కు సామర్థ్యానికి మించి లోడు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ లేదని, పర్మిట్‌ నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ జరిమానా విధించారు. తాజాగా దీనిని బ్రేక్ చేస్తూ ఒడిశా రవాణా శాఖ అధికారులు రూ.6.53 లక్షలు జరిమానా విధించి రికార్డు నెలకొల్పారు. సంబల్‌పూర్‌జిల్లా ఆర్‌టీఓ అధికారి నిబంధనలు ఉల్లంఘించిన ఓ లారీ యజమానికి శనివారం రూ.6,53,100 జరిమానా విధించారు. సంబల్‌పూర్‌ జిల్లా రెమెడలో నాగాలాండ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ లారీని తనిఖీ చేసిన అధికారులు.. ఆ వాహనం నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనకు రూ.500, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనందుకు రూ. 1,000, లారీలో ప్రయాణికులను తీసుకెళ్తున్నందుకు రూ.5 వేలు, ఇన్సూరెన్స్ చెల్లించనందుకు రూ. 1,000, 2014 నుంచి 2019 వరకు ఓఎంవీటీ ట్రాన్సపోర్ట్ ట్యాక్స్ చెల్లించనందుకు రూ.6,40,500, పర్మిట్‌ లేనందుకు రూ.5 వేలు, సాధారణ తప్పులకు రూ.100లు మొత్తం కలిపి రూ.6,53,100ల జరిమానా వేశారు. దీనికి సంబంధించి నగదు వసూలు చేసి సంబంధిత యజమానికి చలానా అందించారు. నాగాలాండ్‌కు చెందిన శైలేష్‌ శంకర్‌లాల్‌ గుప్తా పేరుతో లారీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండగా, ఝార్స్‌గూడకు చెందిన దిలీప్ కర్తా దీనిని నడిపినట్టు అధికారులు తెలిపారు. అయితే, మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి రాకముందే ఈ భారీ జరిమానా విధించడం గమనార్హం. ఆగస్టు 10న వసూలు చేసిన ఈ జరిమానా విషయం నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన చలానా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒడిశా మోటార్ వాహనాల పన్నుల చట్టం ప్రకారం... 2014 నుంచి 2019 వరకు రోడ్డు ట్యాక్స్ చెల్లించలేదని లలిత్ మోహన్ బెహ్రా వ్యాఖ్యానించారు. పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, పర్మిట్ కూడా లేవని, నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణీకులను కూడా తీసుకెళ్తున్నట్టు గుర్తించాని తెలిపారు. దీంతో మొత్తం రూ.6.53 లక్షల జరిమానా విధించామని అన్నారు. అంతేకాదు, కొత్త చట్టం ప్రకారమైతే లారీ యజమానికి రూ.7 లక్షలు జరిమానా విధించేవాళ్లమని, ఇది అమల్లోకి రాకముందే చిక్కడంతో రూ.6.53 లక్షలే వసూలు చేశామని పేర్కొన్నారు.


By September 15, 2019 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/truck-owner-fined-rs-6-5-lakhs-in-sambalpur-in-odisha-but-under-old-traffic-rules/articleshow/71132806.cms

No comments