Breaking News

YSRCP వైపు గంటా చూపు? కీలక నేతతో మంతనాలు? జగన్ గ్రీన్ సిగ్నల్!


గంటా శ్రీనివాస రావు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈయనో ప్రత్యేకమైన నేత. ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గాన్ని మార్చి ఎమ్మెల్యేగా గెలవడం ఈయన స్పెషాలిటీ. 2014లో భీమిలి నుంచి గెలిచి మంత్రి అయిన గంటా.. 2019లో విశాఖ నార్త్ నుంచి విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ఆయన పార్టీ మారతారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆయన టీడీపీని చీలుస్తారని, 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. గతంలో పార్టీలు మారిన నేపథ్యం ఆయనకు ఉండటంతో గంటా మార్పు వార్త నిజమేనని భావించారు. కానీ ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. మరోసారి గంటా పార్టీ మార్పు ప్రచారం తెర మీదకు వచ్చింది. కానీ ఈసారి కాస్త డిఫరెంట్‌ ప్రచారం జరుగుతోంది. ఆయన వైఎస్ఆర్సీపీలో చేరతానే ప్రచారం మొదలైంది. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అవంతి శ్రీనివాస రావు ఒకప్పుడు గంటా సన్నిహితుడు. కానీ గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. అవంతి మంత్రి అయ్యాక గంటాను టార్గెట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గంటా వైఎస్ఆర్సీపీలో చేరతారనే వార్తలు వెలువడుతుండటం ఆసక్తికరంగా మారింది. గంటా ఇటీవలే జగన్ సర్కారుకు కీలక సూచనలు చేశారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన అన్ని అర్హతలూ విశాఖ నగరానికి ఉన్నాయన్నారు. అమరావతిపై స్పష్టత ఇవ్వాలని కూడా ఆయన సీఎంను డిమాండ్ చేశారు. వాస్తవానికి గంటాతో బీజేపీ నేతలు ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రితో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ మంతనాలు జరుపుతున్నారని వార్తలొచ్చాయి. కానీ గంటా మాత్రం వైఎస్ఆర్సీపీలో చేరడానికే మొగ్గు చూపుతున్నారట. గంటాతో విజయసాయి రెడ్డి మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. రాజకీయంగా ఆయనకు ఇబ్బందులు తప్పేలా లేవు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని తేల్చి చెప్పిన జగన్ కూడా గంటా చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ఎలాగంటారా..? పార్టీ మారడం కోసం గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నారట. మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని, ఏదైనా నామినేటెడ్ పదవిని ఇస్తామని జగన్ మాటిస్తే పార్టీ మారడానికి సిద్ధపడాలని గంటా భావిస్తున్నారట. గంటా చేరిక జగన్‌కు కూడా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటిది విశాఖ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ బలపడుతుంది. త్వరలోనే జీవీఎంసీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా గంటా చేరిక అధికార పార్టీకి ఉపకరిస్తుంది. రెండోది టీడీపీని దెబ్బకొట్టాలనే జగన్ లక్ష్యం కూడా నెరవేరుతుంది. గంటా నిజంగానే పార్టీ మారతారా? లేదా? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.


By August 30, 2019 at 08:14AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-senior-mla-ganta-srinivasa-rao-likely-to-join-ysrcp/articleshow/70902637.cms

No comments