Breaking News

విశాఖ ఏజెన్సీలో దారుణం.. గిరిజన యువతిపై అత్యాచారం, హత్య


విశాఖ జిల్లా అరకులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గిరిజన యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి అనంతరం తలపై బండరాయితో మోది కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటనలో ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాంతంలోని చినలబుడు గ్రామానికి చెందిన కిల్లో పుష్ఫ అనే గిరిజన యువతి స్థానికంగా మీసేవా కేంద్రంలో పనిచేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన మహేష్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. భార్య, ఇద్దరు బిడ్డలున్న మహేశ్ రెండో పెళ్లి చేసుకుంటానని వేధిస్తుండగా ఆమె నిరాకరిస్తూ వస్తోంది. ఇదే విషయంపై మాట్లాడుకుందామని శుక్రవారం పుష్ఫను శరభగూడ పాఠశాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పుష్ఫ నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన మహేశ్ ఆమె కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. వదిలేయాలని వేడుకున్నా కనికరించకుండా ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందోమోనన్న ఆందోళనతో బండరాయితో ఆమె తలపై బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం అరకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పుష్ప అత్యాచారం, హత్య విషయం తెలియగానే గ్రామస్థుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమకు అప్పగించాలని బాధితురాలి తల్లిదండ్రులతో పాటు స్థానికులు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మహేశ్‌కు తామే సరైన శిక్ష విధిస్తామన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్టేషన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.


By August 24, 2019 at 11:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tribal-young-woman-rape-and-murder-in-araku/articleshow/70814785.cms

No comments