Breaking News

అబ్బాయితో స్నేహం వద్దన్నందుకు.. తండ్రినే చంపేసింది


చదువుకోవాల్సిన వయస్సులో అబ్బాయితో స్నేహం ఏంటని ప్రశ్నించినందుకు కన్నతండ్రినే చంపేసిందో బాలిక. కూతురు డిగ్రీ విద్యార్థితో చనువుగా ఉండటం, అతడితో తరుచూ ఫోన్లో మాట్లాడటం గమనించిన తండ్రి ఆమెకు మంచి బుద్ధులు చెప్పడమే అతడి మరణానికి కారణమైంది. తన సంతోషానికి అడ్డొస్తున్నాడని ఆ యువకుడితోనే కలిసి తండ్రిని చంపేసింది కూతురు. రాజధాని బెంగళూరులోని రాజాజీనగర్ ఐదో బ్లాక్‌లో ఓ వ్యక్తి భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి నివాసముంటున్నాడు. అతడి కుమార్తె(15) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెకు డిగ్రీ విద్యార్థి ప్రవీణ్‌తో పరిచయమైంది. క్రమంగా వారిద్దరి మధ్య చనువు పెరగడంతో ఆ యువకుడు తరుచూ బాలికి ఇంటికి వచ్చేవాడు. దీనికి తోడు బాలిక చదువడం మానేసి గంటల పాటు అతడితో ఫోన్లో మాట్లాడేది. ఈ విషయాన్ని గమనించిన తండ్రి కూతురిని హెచ్చరించాడు. దీంతో తండ్రిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. తల్లి, తమ్ముడు ఆదివారం పాండిచ్చేరి వెళ్లడంతో తండ్రికి నిద్రమాత్రలు కలిపిన పాలు ఇచ్చింది. అతడు నిద్రలోకి జారుకున్నాక ప్రవీణ్‌ను ఇంటికి పిలిచింది. అతడి సాయంతో తండ్రి గొంతు కోసి మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో పడేశారు. ప్రవీణ్‌ బయటి నుంచి పెట్రోల్ తెచ్చి మృతదేహంపై పోసి నిప్పటించాడు. కాస్త పెట్రోల్ పడటంతో వారిద్దరు కూడా గాయపడ్డారు. మంటలు చెలరేగిన వెంటనే బాలిక బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం ఇంటికి చేరుకున్న పోలీసులు ఏం జరిగిందని బాలికను ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఈ ఘటనకు ముందుకు ప్రవీణ్‌ బాలిక ఇంటికి వెళ్లినట్లు స్థానికులు చెప్పడంతో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. స్నేహితుడి సాయంతో తానే తండ్రిని చంపినట్లు బాలిక చెప్పడంతో కేసు నమోదు చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. బుద్ధిగా ఉండాలని చెప్పినందుకు కన్నతండ్రినే దారుణంగా చంపిన ఘటన బెంగళూరులో కలకలం రేపుతోంది. పిల్లల్లో పెరుగుతున్న హింసా ధోరణికి ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


By August 20, 2019 at 07:47AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/15-yr-old-bengaluru-girl-killed-father-with-boy-friend-help/articleshow/70746987.cms

No comments