Breaking News

శవానికి సైతం అంటరానితనం.. బ్రిడ్జి పై నుంచి దింపి అంత్యక్రియలకు..


మనిషి బతికి ఉన్నన్నాళ్లూ ప్రతి క్షణం పోరాటమే. కూడు, గూడు, గుడ్డ కోసం నిత్యం శ్రమించాల్సిందే. దీనికి వివక్ష అదనం. మనిషి బతికి ఉన్నంత వరకే ఈ పోరాటం. చనిపోయాక.. ఈ కష్టాలేవీ ఉండవనుకుంటాం. కానీ మరణించాక అంత్యక్రియల కోసమూ పోరాడాల్సిన దుస్థితి తలెత్తితే..? అదెంతో బాధాకరం కదూ. తమిళనాడులోని జిల్లా వాణింబాడి సమీపంలోని నారాయణ పురంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నారాయణపురం గ్రామస్థులు మృతదేహాలను శ్మశానానికి తీసుకెళ్లడానికి దారి లేదు. దీంతో పొలాల మీదుగా తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ అగ్రవర్ణాలకు చెందిన పొలాల యజమానులు దళితుల శవాలను తమ పొలాల మీదుగా తీసుకెళ్లడానికి అంగీకరించడం లేదు. దీంతో శవాలను 20 అడుగుల బ్రిడ్జి మీది నుంచి తాళ్ల సాయంతో కిందకు దింపి అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కుప్పన్ అనే దళితుడు వ్యక్తి మరణించగా.. పంట పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలకు చెందిన వారు అంగీకరించలేదు. దీంతో దహనక్రియల కోసం శ్మశాన వాటికకకు శవాన్ని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. శ్మశాన వాటికకు వెళ్లడం కోసం దారి ఇవ్వాలని ఏళ్ల తరబడి కోరుతున్నప్పటికీ.. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి మీది నుంచి మృతదేహాన్ని కిందకు దింపే క్రమంలో తాళ్లు తెగి శవం కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.


By August 22, 2019 at 02:10PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dalit-man-dead-body-lowered-from-20-feet-high-bridge-for-funeral-process-in-vellore/articleshow/70784872.cms

No comments