డ్రగ్స్కు బానిసైన యువతిని గొలుసులతో కట్టేసిన తల్లి.. చికిత్సకు ఎంపీ సాయం!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/70889555/photo-70889555.jpg)
పంజాబ్లోని యువత మత్తు జగత్తులో చిత్తువుతోన్న వాస్తవాలను ఉండ్తా పంజాబ్ సినిమాలో కళ్లకుకట్టినట్టు చూపిన విషయం తెలిసిందే. తాజాగా, డ్రగ్స్కు బానిసైన ఓ యువతిని స్వయానా కన్నతల్లే మంచానికి గొలుసులతో కట్టేసిన ఉదంతం పంజాబ్లో వెలుగుచూడగా, అక్కడ యువత ఎంతగా మత్తుకు అలవాటుపడ్డారో వివరిస్తోంది. మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన తన కుమార్తెను బయటకు వెళ్లకుండా మంచానికే పరిమితం చేయడానికి ముందు ఆ తల్లి.. డ్రగ్స్ మత్తు వదిలించాలని విశ్వప్రయత్నాలు చేసింది. ప్రభుత్వం నిర్వహించే డీ అడిక్షన్ సెంటర్లు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఉదంతం మీడియాలో రావడంతో అమృత్సర్ ఎంపీ, కాంగ్రెస్ నేత గుర్జీత్ సింగ్ అజులా యువతి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ మత్తు నుంచి పూర్తిగా కోలుకునే వరకు ఆ యువతికి సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇదో దురదృష్టకర సంఘటన అని, ఇంటి వద్దే బాధితురాలికి చికిత్స అందజేయాలని వైద్యులను ఎంపీ అజులా ఆదేశించారు. కాగా, ఆ యువతి తల్లి మాట్లాడుతూ.. తన కుమార్తెను పలుమార్లు ప్రభుత్వ డీఅడిక్షన్ కేంద్రాల్లో చేర్పించినా అక్కడ కేవలం నాలుగైదు రోజులు ఉంచుకుని పంపేవారని అన్నారు. డ్రగ్స్కు బానిసైనవారు నాలుగైదు రోజుల్లో ఎలా కోలుకుంటారని ఆమె ప్రశ్నించారు. పూర్తిగా కోలుకునేవరకూ చికిత్స అందజేయాలని వైద్యులను కోరినా వారు పట్టించుకోలేదని ఆమె వాపోయారు. పంజాబ్లో డ్రగ్స్కు అలవాటుపడిన మహిళలకు సంబంధించిన డేటా అందుబాటులో లేకపోవడం గమనార్హం. మహిళల కోసం ప్రత్యేకించి కేవలం ఒక డీ అడిక్షన్ సెంటర్ మాత్రమే అందుబాటులో ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ను ఆరికట్టడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పంజాబ్ ఈ ఏడాది ప్రారంభంలో తెలిపారు. ప్రత్యేక పోలీసు బృందాల సాయంతో డ్రగ్స్ను అమ్ముతోన్న 28 వేల మందిని అరెస్ట్ చేశామని అన్నారు. ఎన్ఫోర్స్మెంట్, చికిత్స ద్వారా డ్రగ్స్ను రాష్ట్రం నుంచి తరమికొడతామని అన్నారు. కాగా, గత రెండున్నరేళ్లలో 160 మంది అధిక మోతాదులో డ్రగ్స్ సేవించడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇక, 2015లో ఎయిమ్స్, నేషనల్ డ్రగ్ డిపెండెన్స్ ట్రీట్మెంట్ సెంటర్ సర్వే.. పంజాబ్లో 3.2 లక్షల మంది డ్రగ్స్ బాధితులకు చికిత్స అవసరమని తేల్చింది. తాజాగా ఎన్డీడీటీసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం వారి సంఖ్య 7.2 లక్షలకు చేరింది. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినవారిని జైలుకు పంపుతున్నారని, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ చట్టం ప్రకారం వారిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించాలని ఈ నివేదిక పేర్కొంది.
By August 29, 2019 at 01:24PM
No comments