Breaking News

శ్రీశైలానికి పోటెత్తుతోన్న వరద.. ఒక్క రోజులోనే 9 టీఎంసీలు


ఎగువ ప్రాంతాల్లో గత వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంది. కర్ణాటకలోని అలమటి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో వచ్చిన వరదను కిందకు వదలిపెడుతున్నారు. సోమవారం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయగా, ప్రస్తుతం అక్కడ నుంచి కృష్ణమ్మ వేగంగా మల్లన్న చెంతకు చేరుతోంది. జూరాల ప్రాజెక్టును దాటి రోజుకు 18 టీఎంసీలు శ్రీశైలం వైపునకు ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో గంటగంటకూ ప్రవాహం పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులో మొత్తం 23 గేట్లను ఎత్తి 1.88 లక్షల క్యూసెక్కులు నీటికి కిందకు విడుదల చేస్తున్నారు. మూడు రోజుల కిందట జూరాల నుంచి నీటి విడుదల ప్రారంభం కావడంతో అది గురువారం ఉదయానికి శ్రీశైలానికి చేరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్టులో 9.15 టీఎంసీల నీటి నిల్వ పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 41.96 టీఎంసీలకు చేరుకోగా ప్రస్తుతం 1.93 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. అటు ఆలమట్టికి 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండగా వచ్చింది వచ్చినట్టే కిందకు విడిచిపెడుతున్నారు. ఈ వరద నారాయణపూర్‌‌కు అక్కడ 19 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఈ ప్రవాహం జూరాలను దాటి శ్రీశైలానికి పరుగులు పెడుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.16 టీఎంసీలుగా ఉంది. పై నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా దిగువకు విడిచిపెడుతున్నారు. మరోవైపు, కాళేశ్వరం వద్ద గోదావరి 31 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తోంది. పుష్కర ఘాట్ల వద్ద నుంచి నీరు నిండుగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ వద్ద 4.26 లక్షల ప్రవాహం నమోదవుతుండగా బ్యారేజీ 65 గేట్ల నుంచి 4.66 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకి కొనసాగుతుండగా ఇతర ప్రాజెక్టులకు ప్రవాహమేదీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి క్రమంగా నీరు చేరుతోంది. గోదావరి పరీవాహకంలో ఆదిలాబాద్‌ జిల్లాలో 258 చెరువులు పూర్తిగా నిండి మత్తడి పోస్తున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో 2702 చెరువులు ఉండగా 1156 చెరువులు సగానికిపైగా నిండాయి. వరంగల్‌ నీటిపారుదల శాఖ సర్కిల్ పరిధిలోని 6 జిల్లాల్లో 6132 చెరువులు ఉండగా 457 సగానికి పైగా నిండాయి. 233 అలుగు పోస్తున్నాయి. మొత్తం ఈ బేసిన్‌లో 20231 చెరువులకు గాను 2494 సగం నిండగా, 1231 నిండటానికి చేరుకున్నాయి. మరో 612 మత్తడి దూకుతున్నాయి. కృష్ణా పరీవాహకంలో 53 చెరువులు నిండాయి.


By August 02, 2019 at 08:49AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/krishna-river-water-flow-continue-from-jurala-project-to-srisailam-dam/articleshow/70491667.cms

No comments