Breaking News

నేడు జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు.. గాంధీభవన్‌కు పార్దీవదేహం


నేటి రాజకీయాల్లో విలువలను పాటించేవారు అతికొద్ది మందే ఉంటారు. ఆలాంటి కోవకు చెందిన వ్యక్తుల్లో సీనియర్ నేత సూది ముందువరుసలో ఉంటారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న అజాత శత్రువు ఆదివారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. జులై 20న తీవ్ర జ్వరంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరిన జైపాల్ రెడ్డికి తర్వాత న్యుమోనియా కారణంగా గుండె, శ్వాస సమస్య ఉత్పన్నమయ్యింది. దీంతో ఆయనను అత్యవసర చికిత్స కోసం ఐసీయూలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు నక్లెస్ రోడ్డులో సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఆయన పార్ధీవదేహాన్ని హైదరాబాద్‌లో గాంధీభవన్‌కు తరలించనున్నారు. అక్కడ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ప్రభుత్వ లాంఛనాలతో పీవీ ఘాట్ పక్కనే జైపాల్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జైపాల్‌రెడ్డి మరణంపై రాష్ట్రపతి, ఉప-రాష్ట్రపతి ప్రధాని, పలు రాష్ట్రాల సీఎంలు సహా అనేక మంది రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా చండూరు మండలం నెర్మట గ్రామంలో 1942 జనవరి 16న సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ దంపతులకు జన్మించిన జైపాల్‌రెడ్డి, దేవరకొండలో ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ పట్టా పొందిన ఆయన విద్యార్థిదశ నుంచే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించారు. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. కీలకమైన తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ కేంద్రంగా క్రియాశీలకంగా వ్యవహరించారు. తొలి దశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సమైక్యవాదానికి మద్దతుగా నిలిచిన జైపాల్‌రెడ్డి మలి దశలో మాత్రం క్రియాశీలక పాత్ర పోషించారు. ఒక దశలో ముఖ్యమంత్రి పగ్గాలను సైతం అధిష్ఠానం అప్పగిస్తే దానిని తిరస్కరించారని అంటారు. జైపాల్ రెడ్డి కాదంటేనే కిరణ్‌కుమార్ రెడ్డిని సీఎం పీఠాన్ని అప్పజెప్పారని నాడు ముమ్మరంగా ప్రచారం సాగింది. అలాగే విభజన సమయంలో హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తే, దానిని తీవ్రంగా వ్యతిరేకించి, తన వాణిని బలంగా వినిపించారు.


By July 29, 2019 at 10:01AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/senior-congress-leader-jaipal-reddy-funeral-to-take-place-today/articleshow/70427614.cms

No comments