శ్రీకాకుళంలో నీళ్ల కోసం మహిళల ఘర్షణ... ఒకరి మృతి

మంచినీళ్లు పట్టుకునే విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళ మృతికి కారణమైంది. జిల్లా సోంపేటలో తాగునీటి కుళాయి వద్ద మహిళలు బిందెలతో కొట్టుకోవడంతో పద్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. సోంపేటలోని పల్లెవీధిలో సోమవారం ఉదయం తాగునీరు పట్టుకునేందుకు కొందరు మహిళలు కుళాయి దగ్గరకు వచ్చారు. నీళ్లు పట్టుకునే విషయంలో మహిళల మధ్య మాటామాటా పెరగడంతో ఒకరినొకరు బిందెలతో కొట్టుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గొడవను ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో పద్మ అనే మహిళ నాచుపై కాలుజారి వెనక్కి పడిపోయింది. ఆమె తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నీళ్లు పట్టుకునే సమయంతో పద్మకు సుందరమ్మ అనే మహిళతో గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కుళాయి దగ్గరకు నేను ముందొచ్చానంటూ ఇద్దరూ వాదులాడుకున్నారని, సుందరమ్మ తోసేయడంతోనే పద్మ అదుపుతప్పి పడిపోయి ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
By July 15, 2019 at 10:45AM
No comments