Breaking News

కాకినాడలో కలకలం రేపిన క్షుద్రపూజలు


ప్రశాంతంగా ఉండే జిల్లా కేంద్రం కాకినాడలో క్షుద్రపూజల ఘటన కలకలం రేపింది. గొడారిగుంటలోని సీతారాంపురంలో ఆదివారం రాత్రి కొందరు క్షుద్రపూజలు నిర్వహించారు. ఓ భవనంలో నుంచి అరుపులు కేకలు వినిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న సర్పవరం పోలీసులు అక్కడి ఏర్పాట్లు చూసి షాకయ్యారు. భవనంలోని హాలులో కుండల్లో నెయ్యిపోయి దీపారాధన, కుంకుమ, కొబ్బరికాయలు, బలి ఇచ్చేందుకు మూడు నాటుకోళ్లు సిద్ధంగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పూజల్లో పాల్గొన్న ఏడుగురిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సగరపేటకు చెందిన యువకులు, చిన్నారులు ఆకస్మికంగా చనిపోతున్నారని, దీంతో స్థానికులు కొందరు రాజపూడికి చెందిన సిద్ధాంతిని సంప్రదించి ఆయన సూచనల మేరకు క్షుద్రపూజలు చేపట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైనా క్షుద్రపూజలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జూన్ నెలలోనూ క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపింది. అమలాపురం సమీపంలోని ఓ అరటి తోటలో రాత్రి సమయంలో మంతాలు వినిపించడంతో స్థానికులు క్షుద్రపూజలుగా అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు కనుక్కొని అలాంటిదేమీ లేదని నిర్ధారించుకున్నారు. ఓ యువకుడికి పెళ్లి కావడం లేదని కుటుంబసభ్యులు అరటి చెట్టుతో గుట్టుగా పెళ్లి జరిపించారు. ఈ మంత్రాలు విన్న స్థానికులు క్షుద్రపూజలుగా అనుమానించడంతో కలకలం రేగింది.


By July 08, 2019 at 12:53PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/locals-conducts-occult-pooja-in-kakinada-city-7-arrested/articleshow/70124783.cms

No comments