Breaking News

అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం.. ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యేపై దాడి!


పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ, నేతల మధ్య గొడవలకు దారితీసిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. నియోజకవర్గంలోని సోంపేట మండలం పలాసపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాము అధికారంలో ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఎలా ప్రారంభిస్తారని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అశోక్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీనికి టీడీపీ నేతలు సైతం దీటుగానే స్పందించారు. తమ ఎమ్మెల్యే చేతులమీదుగానే ప్రారంభోత్సవం జరగాలని టీడీపీ కార్యకర్తలు సైతం భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఈ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. పలాసపురంలో కొత్తగా నిర్మించిన పంచాయతీ ఆఫీసు, అంగన్‌వాడీ భవనం, ఉన్నత పాఠశాలలో డిజిటల్‌ తరగతి గదిని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు చేరుకున్నారు. స్థానిక నేతలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లుచేశారు. అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే అశోక్‌ను స్థానిక వైసీపీ నేత పిరియా అప్పలస్వామి అడ్డుకుని గ్రామానికి ఏం చేశారని నిలదీశారు. వైసీపీ నాయకులు ఘర్షణకు దిగి ఎమ్మెల్యేను నెట్టివేసి, దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు కూడా గొడవకు దిగడంతో పరస్పరం తోపులాట, పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఈ సమయంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు జి.కె.నాయుడుతో పాటు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ, స్థానికులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన నేతలు గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న సోంపేట సీఐ కె.శ్రీనివాసరావు, ఎస్‌.ఐ.వెంకటేష్‌ సంఘటనాస్థలానికి వెళ్లి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్‌ ప్రారంభోత్సవాలు పూర్తిచేశారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ఏ ఇబ్బందులు ఏర్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినా ఆదివారం ఉదయం నాటికి శిలాఫలకాలు అదృశ్యమయ్యాయి. అయినా ఎమ్మెల్యే అశోక్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఓవైపు ప్రారంభోత్సవానికి టీడీపీ నేతలు ఏర్పాట్లు చేయగా, పక్కనే మంత్రి కృష్ణదాస్‌ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు వైసీపీ కార్యకర్తలు డీజే సౌండ్‌సిస్టమ్‌ ఏర్పాటుతో వివాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించే అవకాశం లేని వాతావరణం అక్కడ నెలకొంది. పలాసపురం ఘర్షణపై ఇరువర్గాలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ నేరుగా సోంపేట పోలీసుస్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


By July 08, 2019 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-leaders-attack-to-ichapuram-tdp-mla-bendalam-ashok-at-palasapuram/articleshow/70121901.cms

No comments