Breaking News

హయత్‌నగర్ కిడ్నాపర్ ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డ్


రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో బీఫార్మసీ విద్యార్థిని సోనీ(21) కేసు హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన రవిశేఖర్‌ సినీఫక్కీలో యువతిని కిడ్నాప్ చేసి తెలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరాడు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ గాలిస్తున్నా అతడి ఆచూకీని పోలీసులు కనుగొనలేకపోయారు. కిడ్నాపర్ స్వగ్రామంలోనూ విచారించినా ఎలాంటి క్లూ దొరకలేదు. అతడి కొడుకు, అల్లుడిని అరెస్ట్ చేసి ప్రశ్నించినా కేసు ముందుకు వెళ్లడంలేదు. కిడ్నాప్ జరిగి ఐదు రోజులు కావడంతో యువతిని ఏం చేశాడా? అన్న ఆందోళన ఆమె తల్లిదండ్రుల్లో నెలకొంది. కిడ్నాపర్ కోసం ముమ్మర వేట కొనసాగిస్తూ ఫలితం లేకపోవడంతో రాచకొండ పోలీసులు రివార్డ్ ప్రకటించారు. కిడ్నాపర్ రవిశేఖర్‌ ఆచూకీ చెబితే రూ.లక్ష రివార్డ్ ఇస్తామని, వివరాలు చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ప్రకటించారు. ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి విద్యార్థినితో పాటు ఆమె తండ్రిని ఈ నెల 23న రవిశేఖర్‌ కారులో తీసుకెళ్లాడు. హయత్‌నగర్‌లో కారు ఆపి జిరాక్స్ తీసుకురావాలని యువతి తండ్రిని పంపి ఆమెను తీసకుపోయాడు. సీసీ కెమెరాల పుటేజీలో కారు నంబర్ గుర్తించిన పోలీసులు విచారించగా దాన్ని కర్ణాటకలోని గుల్బర్గాలో చోరీ చేసినట్లు తేలింది. కిడ్నాపర్ కర్నూలు వైపు వెళ్లినట్లు గుర్తించి ఆ మార్గంలో జల్లెడ పడుతున్నారు. రవిశేఖర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 26కి పైగా చోరీ కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రవిశేఖర్ ఈ నెల 20న తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు మహిళలను నమ్మించి రూ.65వేలు దోచుకున్నాడు. ఇద్దరినీ రోజంతా కారులో తిప్పి 22వ తేదీన శ్మశానం వద్ద కారులో నుంచి తోసి పరారయ్యాడు. అదే కారులో అతడు హైదరాబాద్ వచ్చి కిడ్నాప్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి రవిశేఖర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఐదురోజులైనా కిడ్నాపర్‌ను ఆచూకీ కూడా తెలుసుకోలేకపోవడం పోలీసుల సత్తాకే సవాల్‌గా మారింది.


By July 29, 2019 at 08:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rachakonda-police-announcing-rs-1-lakh-reward-for-kidnaper-ravi-shekar/articleshow/70426198.cms

No comments