Breaking News

మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. ఆగస్టు తొలివారంలోనే?


రాష్ట్రంలో మున్సిపల్ మరో నెలరోజుల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు తొలి వారంలో ఎన్నికలు నిర్వహిస్తే బందోబస్తు ఏర్పాట్లకు తాము సిద్ధమేనని డీజీపీ మహేందర్‌రెడ్డి ఈసీకి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల జాబితా సవరణ, ప్రింటింగ్‌పై కొత్త షెడ్యూల్‌ను తెలంగాణ ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి శనివారం విడుదల చేశారు. తొలి షెడ్యూల్ ప్రకారం ఓటర్ల తుది జాబితాలను 18వ తేదీన ప్రచురించాల్సి ఉన్నా.. ఆ తేదీని నాలుగు రోజులు ముందుకు అంటే 14వ తేదీకి సవరించారు. జాబితాల తయారీ ప్రక్రియను పదో తేదీ నుంచి ప్రారంభించనున్నారు. 2019, జనవరి 1 నాటికి ఉన్న అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం వార్డులు, మున్సిపాలిటీల వారీగా జాబితాను వెలువరించాలని ఈసీ షెడ్యూల్‌లో పేర్కొంది. ఓటర్ల జాబితాల తయారీకి ఎక్కువ రోజులు పట్టినందునే ఆయా తేదీల్లో మార్పులు చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. జులై రెండో వారంలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తామని, వారి సంసిద్ధత ఆధారంగానే ఎన్నికల తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. ప్రస్తుతమున్న అవకాశాల మేరకు ఆగస్టు తొలి వారంలోనే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వానికి ఇప్పటికే ఎస్‌ఈసీ సమర్పించినట్టు తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలోనే ఎన్నికలు నిర్వహించి ఆ వెంటనే ఓట్ల లెక్కింపు పూర్తిచేయడంతో పాటు నూతన పాలకవర్గాలకు పదవీ బాధ్యతలను అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.


By July 07, 2019 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-municipal-elections-likely-on-august-1st-week/articleshow/70111629.cms

No comments