Breaking News

పంజాగుట్టలో నడిరోడ్డుపై వ్యాపారిపై కత్తులతో దాడి


హైదరాబాద్‌లో నడిరోడ్డుపై హత్యలు, దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయి. గతేడాది నుంచి ఇలాంటి ఎన్నో ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. గతవారం సర్కిల్ వద్ద ఓ ఆటో డ్రైవర్‌ను ఓ వ్యక్తి కత్తులతో తీవ్రంగా పొడవగా బాధితుడు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. నగరంలో తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన మరువకముందే పంజాగుట్టలోనే నడిరోడ్డుపై అలాంటి ఘటనే జరిగింది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే శనివారం రాత్రి ముగ్గురు దుండుగులు ఓ వ్యాపారిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. విజయవాడకు చెందిన రాంప్రసాద్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఖాజాగూడలో నివాసముంటూ ఐరన్ వ్యాపారం చేస్తున్నాడు. అతడికి ఒంగోలులోనూ వ్యాపారాలున్నాయి. పంజాగుట్టలోని దుర్గానగర్‌లో ఆఫీసు నిర్వహించే రాంప్రసాద్ శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆఫీసు మూసివేసి సమీపంలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నాడు. గుడి నుంచి బయటకు రాగానే ఆయనపై ముగ్గురు దుండుగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. తల, దవడ భాగాల్లో కత్తిపోట్లకు గురైన రాంప్రసాద్ ప్రాణాలు కాపాడుకునేందుకు నడిరోడ్డుపైనే పరుగులు పెట్టి ఓ కారు వద్ద పడిపోయాడు. ర రాంప్రసాద్ చనిపోయాడనుకున్న దుండుగులు ఓ కారులో అక్కడి నుంచి పరారయ్యారు. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితుడిని సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. వ్యాపార లావాదేవీలే ఈ దాడికి కారణంగా అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటుచేశారు. రాంప్రసాద్ కాల్స్‌డేటాను సేకరించిన పోలీసులకు ఆయనతో ఎవరెవరు మాట్లాడారు అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. రద్దీ సమయంలో నడిరోడ్డుపై ఈ ఘటన జరగడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నగరంలోనే కీలక ప్రాంతమైన పంజాగుట్టలో వరుస ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోందని ప్రజలు చెబుతున్నారు.


By July 07, 2019 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/business-man-stabbed-near-panjagutta-police-station-in-hyderabad/articleshow/70111439.cms

No comments