Breaking News

ఫ్రెండ్స్‌తో కలిసి బంధువుల ఇంటికే కన్నం.. కిలేడి ఆట కట్టించిన పోలీసులు


ఆర్థిక అవసరాల కోసం పెద్దమ్మ ఇంట్లోనే ఫ్రెండ్స్‌తో దొంగతనం చేయించిందో మహిళ. ఏకంగా 53 తులాల బంగారం, రూ.5లక్షల నగదు కొట్టేసింది. పోలీసులకు దొరక్కుండా స్నేహితులతో పని కానిచ్చేసింది. సినీఫక్కీలో అత్యంత పకడ్బందీగా చోరీకి పాల్పడినా కాల్‌డేటా నిందితులను పట్టించేసింది. దీంతో మహిళతో పాటు ఆమె ఇద్దరు ఫ్రెండ్స్‌ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. రాంనగర్‌లో నివాసముండే పిళ్లా వినయకుమారికి భర్త చనిపోవడంతో కుమార్తెతో కలిసి ఉంటోంది. ఆమెకు కూతురు వరుసైన బేగంపేట నివాసి ఖుష్బూ అప్పుడప్పుడు వారింటికి వచ్చి బాగోగులు అడిగి వెళ్తుండేది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఖుష్బూ.. వినయకుమారి ఇంట్లో భారీగా నగదు, బంగారం ఉండటాన్ని గుర్తించి వాటిని కొట్టేయాలని భావించింది. దీనికోసం సూర్య, వంశీల సహకారం తీసుకుంది. ఈ నెల 19న వినయకుమారి ఇంటికి వెళ్లిన ఖుష్బూ వారికి తల్లీకూతుళ్లకు మత్తుమందు కలిపి నిమ్మరసం ఇచ్చింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వారిని తానే ఆస్పత్రికి తీసుకెళ్లి అదే సమయంలో ఫ్రెండ్స్‌ను ఇళ్లు దోచుకోమని చెప్పింది. రెండ్రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వినయకుమారి, ఆమె కూతురు ఇంట్లో నగదు, బంగారం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. వేలిముద్రలు పడకుంగా దొంగలు గ్లౌజులు ధరించినట్లు గుర్తించారు. దీంతో మరోకోణంలో బాధితులతో పాటు వారి బంధువుల ఫోన్ల నంబర్లు తీసుకుని కాల్‌డేటాను పరిశీలించారు. అప్పుడే ఖుష్బూ పథకం బట్టబయలైంది. 19వ తేదీన ఆమె ఇద్దరు వ్యక్తులతో సుమారు 70సార్లు మాట్లాడినట్లు, దొంగతనానికి సూచనలిస్తూ వంశీ, సూర్యతో వాట్సాప్‌లో చాట్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. ఫోన్ నంబర్ల ఆధారంగా పోలీసులు మిగిలిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.


By July 27, 2019 at 12:34PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-womantwo-men-arrested-for-committed-theft-in-relatives-house/articleshow/70407064.cms

No comments