గాంధీ ఆస్పత్రి సిబ్బందికి టిక్టాక్ రోగం.. ఇద్దరిపై వేటు
ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు మానేసి వీడియోలు చేస్తూ కాలక్షేపం చేస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. ఇటీవల ఖమ్మం కార్పోరేషన్ ఉద్యోగులు పనులు మానేసి టిక్టాక్ వీడియోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు 11 మంది సిబ్బందిపై వేటు వేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు మానేసి టిక్టాక్ వీడియోలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. తాజాగా టిక్టాక్ రోగం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి చేరింది. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ఓ పక్క రోగులందరికీ వైద్యం అందించడానికి సరిపడా వైద్య సిబ్బంది లేక ఇబ్బందులు పడుతుంటే మరోపక్క కొందరు సిబ్బంది మాత్రం పనులు మానేసి టిక్టాక్ వీడియోలు చేస్తూ కాలం గడిపేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలోని ఫిజియోథెరపీ విభాగంలో ఇద్దరు వైద్య సిబ్బంది విధులు మానేసి చేసిన టిక్టాక్ వీడియోలు వైరల్గా మారాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఆ ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ ప్రకటించారు. టిక్టాక్ వీడియోల వ్యవహారంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం తామెంతో దూరం నుంచి వ్యయప్రయాసలకోర్చి ఆస్పత్రికి వస్తుంటే సిబ్బంది పట్టించుకోకుండా ఇలాంటి వీడియోలు తీసుకుంటూ గడిపేస్తున్నారని మండిపడుతున్నారు. ఇకపై ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా అధికారులు కఠినచర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.
By July 26, 2019 at 12:08PM
No comments