టీఆర్ఎస్ ఎంపీటీసీని ఎత్తుకెళ్లిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన ఎంపీటీసీ సభ్యుడిని మావోయిస్టులు ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. జిల్లాలోని చర్ల మండలం బెస్తకొత్తూరులో ఎంపీటీసీ సభ్యుడు నల్లూరి శ్రీనివాసరావు ఇంటికి వచ్చారు. ఆయన భార్య, పిల్లలతో నిద్రిస్తుండగా అర్ధరాత్రి వేళ ముగ్గురు లోనికి వెళ్లి శ్రీనివాసరావును నిద్రలేపారు. దీంతో షాక్కు గురైన ఆయన్ని చేతులు పట్టుకుని బయటకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. శ్రీనివాసరావును తీసుకెళ్లొద్దంటూ ఆయన భార్య దుర్గ, కుమారుడు ప్రవీణ్కుమార్ ప్రాధేయపడగా వారిపై దాడికి పాల్పడ్డారు. ఎంపీటీసీ ఇంట్లో ఉన్న బైక్పైనే శ్రీనివాసరావును అడవుల్లోకి తీసుకెళ్లారు. ఆయన ఇల్లు ఊరి చివరన ఉండటంతో గ్రామస్థులకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ ఘటనలో సుమారు 15 మంది వరకు మిలీషియా సభ్యులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో కొంతకాలంగా కామ్గా ఉన్న మావోయిస్టులు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధినే కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. శ్రీనివాస్ ఎంపీటీసీ సభ్యత్వం ఆగస్టు 5వ తేదీతో ముగియనుండటం విశేషం.
By July 10, 2019 at 08:29AM
No comments