Breaking News

జూరాల నుంచి శ్రీశైలానికి కదిలిన కృష్ణమ్మ.. శుక్రవారం నాటికి మల్లన్న చెంతకు!


గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాల్లోని ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో నదుల్లో జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరుతుంది. గోదావరిలో జులై నెలాఖరు వరకు పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నా, గత రెండు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. ఎగువన ఉన్న రిజర్వాయర్లలో నీటి లభ్యత అరకొరగా ఉంటే, దిగువన మాత్రం భారీగా ఉంది. శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం లేకపోయినా, మంగళవారం కడెం ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి 26 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. కాగా, కృష్ణమ్మ సైతం బిరబిరా పరుగులెడుతోంది. నారాయణ్‌పూర్‌ను దాటి తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన కృష్ణవేణి జూరాలను చేరింది. ప్రస్తుతం ఇందిరా ప్రియదర్శిని జూరాలను దాటి శ్రీశైలంవైపు పరుగులు పెడుతోంది. నారాయణపేట జిల్లా కృష్ణా గ్రామం వద్ద మంగళవారం వరద నీరు పోటెత్తింది. మంగళవారం ఉదయానికి 4 వేల క్యూసెక్కులు ఉన్న ప్రవాహం సాయంత్రానికి లక్ష క్యూసెక్కులను దాటింది. దీంతో మూడు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించి 24 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. పై నుంచి ప్రవాహం అలాగే కొనసాగడంతో బుధవారం ఉదయానికి విద్యుత్ ఉత్పత్తి, గేట్ల ద్వారా 74 వేల క్యూసెక్కుల నీటికి కిందికి వదులుతున్నారు. జూరాల నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యాంను శుక్రవారం నాటికి ప్రవాహం తాకే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఎగువన ఆలమట్టిలో ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. మంగళవారం ఉదయం లక్ష క్యూసెక్కుల ఉండగా సాయంత్రానికి అది 1.18 లక్షలకు చేరుకుంది. అలాగే నారాయణపూర్‌కు 1,90,000 క్యూసెక్కులు చేరుతుండగా 2,11,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్రకు 15 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలు కాగా, ఒక్క రోజులోనే ఐదు టీఎంసీలు వచ్చి చేరింది.


By July 31, 2019 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/nearly-one-lakh-cusec-water-releases-from-jurala-to-srisailam-project/articleshow/70459287.cms

No comments