Breaking News

పీపీఏల వివాదం.. జగన్ సర్కారుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!


గత ప్రభుత్వం హయాంలో కుదుర్చుకున్న సోలార్, పవన విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించడానికి సిద్ధమైన ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మోకాలడ్డటం, ఆయా సంస్థలు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. పీపీఏల సమీక్షకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ జులై 1న ఇంధన శాఖ జు 1న జీవో జారీచేసింది. దీనిపై 40కిపైగా విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. తాజాగా, తాము ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తును తీసుకోవడానికి సర్కారు నిరాకరిస్తుందని పేర్కొంటూ ఈ సంస్థలు మరోసారి హైకోర్టును ఆశ్రయించాయి. తాము ఉత్పత్తి చేసిన పవన విద్యుత్తును తీసుకునేందుకు ఏపీ రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ), ప్రభుత్వం నిరాకరిస్తున్నాయని తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. విద్యుత్తు తీసుకోవడంలో కోత విధిస్తున్నారని మరికొన్ని కంపెనీలు తెలిపాయి. అలాగే, 2015 నాటి పీపీఏల సమీక్ష కోసం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీవో నెంబరు 63, అలాగే ధరను తగ్గించాలని కోరుతూ ఏపీఎస్పీడీసీఎల్‌ రాసిన లేఖను సస్పెండ్‌ చేయాలని సంస్థల తరఫు లాయర్ కోరారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. గంగారావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఇంధన శాఖ జారీ చేసిన జీవో 63, ఎస్పీడీసీఎల్ నిర్ణయాల అమలును నాలుగు వారాలు సస్పెండ్‌ చేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ప్రస్తుత పిటిషన్ దాఖలుచేసి సంస్థలకు వర్తింపజేశారు. విద్యుత్‌ తీసుకోవడానికి నిరాకరించిన సందర్భాలు, కరెంట్ డిమాండ్‌, గ్రిడ్‌ భద్రతపై పూర్తి వివరాల్ని సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. కాగా, మరికొన్ని సంస్థలు జీవో 63ను సవాల్ చేస్తూ మంగళవారం హైకోర్టును ఆశ్రయించాయి. తమకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలని అవి అభ్యర్థించాయి. స్టే ఇచ్చిన తర్వాత విద్యుత్తు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని, ప్రాథమికంగా చూస్తే ఆ చర్య తమ ఆదేశాల్ని ధిక్కరించేదిగా ఉందని ప్రభుత్వాన్ని ఉద్దేశించి న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ ఎస్‌.శ్రీరామ్‌... వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ తగ్గిందని, బకాయిలు చెల్లించే విషయంపై పూర్తి వివరాలతో అఫిడ్‌విట్ దాఖలు చేస్తామని తెలిపారు. ఒప్పందం చేసుకున్న సంస్థలకు ఏమైనా అభ్యంతరాలుంటే ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని ఆశ్రయించాలే గానీ హైకోర్టుకు రావడానికి వీల్లేదని ఆయన పేర్కొన్నారు.


By July 31, 2019 at 09:41AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-high-court-sensational-comments-on-ysrcp-government-for-ppas/articleshow/70459829.cms

No comments