Breaking News

బిగ్‌బాస్-3 ఎఫెక్ట్: పోలీసు వలయంలో నాగార్జున నివాసం


మరో రెండ్రోజుల్లో ప్రారంభమయ్యే బిగ్‌బాస్ సీజన్-3 షోపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో ప్రముఖ సినీహీరో అక్కినేని ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బిగ్‌బాస్-3కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో నిర్వహణపై కొద్దిరోజులుగా అనేక వివాదాలు, ఆరోపణలు వస్తున్నాయి. బిగ్‌బాస్ షో నిర్వాహకులు తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ యాంకర్ శ్వేతారెడ్డి, సినీనటి గాయత్రిగుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కార్యక్రమంపై అనేక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునపైనా చాలామంది మండిపడుతున్నారు. ఆయన ఇంటి వద్ద ధర్నా చేస్తామని ఓయూ జేఏసీ పిలుపునివ్వడంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-46లోని నాగార్జున నివాసం వద్ద బుధవారం సాయంత్రం నుంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. అటువైపు వస్తున్న వ్యక్తులను తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. బిగ్‌బాస్‌ షోను నిలిపివేయాలి: ఓయూ జేఏసీ‘మా టీవీ’లో ఈ నెల 21న ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్‌’ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ ఓయూ జేఏసీ గురువారం మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ కోసం పోటీదారులకు ఎంపిక చేసే స్క్రీన్‌టెస్ట్‌లో భాగంగా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని జేఏసీ నేతలు కందుల మధు, వి.వెంకట్‌, మహేందర్‌, రామకృష్ణ ఆరోపించారు. స్త్రీ, పురుషులను 100రోజుల పాటు ఒకే ఇంట్లో బంధించి వారి ప్రవర్తనను సీసీ కెమెరాల ద్వారా సీక్రెట్‌గా చిత్రీకరించడం నేరమని, ఈ షోను అడ్డం పెట్టుకుని మహిళలను లైంగికంగా దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.


By July 19, 2019 at 09:34AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hyderabad-police-provided-security-to-nagarjunas-residence-after-ou-jac-warn-him/articleshow/70287323.cms

No comments