Breaking News

చంద్రయాన్-2.. ప్రారంభమైన 20 గంటల కౌంట్‌డౌన్


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ () పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి అంతా సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌ నుంచి సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు జీఎస్‌ఎల్వీ-మార్క్ 3ఎం1 రాకెట్ ద్వారా నింగిలోకి పంపనున్నారు. రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించే చంద్రయాన్‌-2కు 20 గంటల కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 6.51 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 20 గంటలపాటు కొనసాగిన తర్వాత జీఎస్ఎల్వీ మార్క్-3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగానికి ముందు నిర్వహించే రాకెట్ సన్నద్ధత సమావేశం షార్‌లోని బ్రహ్మ ప్రకాష్‌ హాలులో శనివారం సాయంత్రం వరకు నిర్వహించారు. ఇందులో రాకెట్‌ ప్రయోగ తేదీ, సమయం అధికారికంగా నిర్ధరించారు. అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సమావేశం రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. ఈ సందర్భంగా జీఎస్‌ఎల్‌వీ ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. చంద్రయాన్‌-2 ఉపగ్రహంలో రోవర్‌, ల్యాండర్‌, ఆర్బిటర్‌ అనుసంధానం చేశారు. దీని మొత్తం బరువు 3,447 కిలోలు కాగా ఇందులో ప్రొపెల్లర్‌ బరువు 1179 కిలోలు. ప్రయోగం జరిగిన అయిదు రోజుల తరువాత భూ నియంత్రిత కక్ష్యలోకి ఈ ఉపగ్రహం ప్రవేశించనుంది. అక్కడ నుంచి 3.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుని వైపు పయనిస్తుంది. సుమారు 50 రోజులు పాటు ప్రయాణించి సెప్టెంబరు 6,7 తేదీల్లో చంద్రునిపై కాలుమోపే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఉపగ్రహం చంద్రుని కక్ష్యకు చేరుకున్న తరువాత ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి దక్షిణ ధ్రువానికి దగ్గరగా దిగతుంది. అందులో నుంచి రోవర్‌ బయటకొచ్చి 300 నుంచి 400 కిలోమీటర్లు మేర పయనిస్తోంది. అక్కడే 14 రోజులపాటు ఉండి చంద్రుడి ఉపరితలాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి సమాచారం, ఫోటోలను 15 నిమిషాల్లో పంపనుంది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఉపగ్రహం తయారీకి రూ.603 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ల్యాండర్‌కు విక్రమ్‌, రోవర్‌కు ప్రజ్ఞాన్‌గా నామకరణం చేశారు. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ఎం1 రాకెట్ రూపకల్పనకు రూ.375 కోట్లు ఖర్చయ్యింది.


By July 14, 2019 at 08:10AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/countdown-starts-at-sriharikota-shar-centre-for-chandrayaan-2-mission/articleshow/70211413.cms

No comments