Breaking News

తహసీల్దార్ లావణ్యకు 14రోజుల రిమాండ్... చంచల్‌గూడ జైలుకు తరలింపు


రెండేళ్ల క్రితం ఉత్తమ తహసీల్దార్‌గా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న కేశంపేట ఎమ్మార్వో లావణ్య అవినీతికి పాల్పడి పరువు పోగొట్టుకున్నారు. నాడు కీర్తించిన నోళ్లే నేడు ఆమెపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. అవినీతి కేసులో అరెస్టయిన ఆమెకు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అవినీతి కేసులో ఇరుక్కున్న కేశంపేట తహసీల్దార్‌ లావణ్య ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఇంట్లో ఏకంగా రూ.93లక్షల నగదు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. లంచాల సొమ్మును ఎక్కడ దాయాలో తెలీక ఇంట్లోనే ఉంచినట్లు తేలడంతో ఆ డబ్బును ఏసీబీ అధికారులు సీజ్ చేసి ఆమెతో పాటు కొందుర్గు వీఆర్వో అనంతయ్యను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఏసీబీ కార్యాలయంలో విచారించారు. లావణ్యకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి ఆయన ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి తహసీల్దార్ లావణ్య, వీఆర్వో అనంతయ్యకు 14రోజుల రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వో అనంతయ్యను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో హయత్‌నగర్‌లో నివాసముంటున్న కేశంపేట తహసీల్దార్‌ లావణ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా రూ.93లక్షల నగదు, 43 తులాల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రభుత్వ అధికారి నుంచి ఇంత మొత్తంలో అక్రమార్జనను స్వాధీనం చేసుకోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారని ఏసీబీ అధికారులు చెప్పడం గమనార్హం.


By July 12, 2019 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/keshampet-tahsildar-lavanya-gets-14-days-reamnd-shifted-to-chanchalguda-jail/articleshow/70185171.cms

No comments