Breaking News

ప్రేమజంట ప్రాణం తీసిన ‘పరువు’.. తమిళనాడులో ఘోరం


కులం, మతం చూడకుండా ప్రేమ బంధంతో ఒక్కటవుతున్న జంటలు పరువు హత్యకు గురవుతున్న ఘటనలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి. తమకన్నా తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కక్షతో తండ్రి, సోదరులే ఓ బాలింత ప్రాణాలు తీసిన ఘటన రెండ్రోజుల క్రితం చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జరిగిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఈ ఘటన మరువక ముందే పక్క రాష్ట్రం తమిళనాడులో మరో ఘోరం జరిగింది. తక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడన్న ఆక్రోశంతో యువకుడి సోదరులే ప్రేమ జంటపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రేమికులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో తీవ్ర కలకలం రేపిన ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. కోయంబత్తూరు మెట్టుపాలయం ప్రాంతానికి చెందిన కనకరాజ్ (22) అనే యువకుడు స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. అతడిని అదే ప్రాంతానికి చెందిన దర్శిని ప్రియ(17) అనే యువతితో పరిచయమై అదికాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబాలు వీరి ప్రేమకు అడ్డు చెప్పాయి. దీంతో ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. వారిని వెతికి పట్టుకున్న ఇరు కుటుంబాల వారు గ్రామంలో పంచాయతీ పెట్టారు. కులాలు వేరు కావడంతో ఇద్దరూ ప్రేమకు ఫుల్‌స్టాప్ పెట్టాలని, ఇంకెప్పుడూ కలుసుకోకూడదని పెద్దలు హెచ్చరించారు. అయితే పెద్దలు, కుటుంబసభ్యుల హెచ్చరికలను పట్టించుకోని కనకరాజ్, దర్శినిప్రియ ఎవరికి తెలియకుండా అప్పుడప్పుడూ కలుస్తూనే ఉన్నారు. తక్కువ కులం అమ్మాయితో ప్రేమేంటని అతడి సోదరుడు వినోద్ హెచ్చరించినా కనకరాజ్‌ పట్టించుకోలేదు. దీంతో కుటుంబం పరువు పోతుందని ఆగ్రహించిన వినోద్ మంగళవారం కనకరాజ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. అతడికి అడ్డుకునేందుకు దర్శినిప్రియపైనా వినోద్ విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కనకరాజ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. దర్శినిప్రియ శనివారం మృతిచెందింది.


By June 30, 2019 at 12:35PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/coimbatore-honour-killing-tamil-nadu-man-kills-brother-and-his-lover-in-suspected-caste-murder/articleshow/70009140.cms

No comments