Breaking News

కాలేజ్ స్టూడెంట్‌పై రేప్.. కోర్టులో లొంగిపోయిన ఎంపీ


కాలేజీ స్టూడెంట్‌పై కేసులో పరారీలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్ ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయారు. భార్యను పరిచయం చేస్తానని మే 1వ తేదీన ఇంటికి తీసుకెళ్లిన అతుల్‌రాయ్ తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ కాలేజీ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై రేప్ కేసు నమోదు చేశారు. అతుల్‌రాయ్‌పై అత్యాచార ఆరోపణలు వచ్చినా బీఎస్పీ చీఫ్ మాయావతి వెనక్కి తగ్గలేదు. గోస్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. ఈ వివాదం మధ్యే ఆయన ఎన్నికల్లో గెలుపొంది ఎంపీ అయ్యారు. ఈ ఘటనపై తనకేమీ తెలీదని మొదట బుకాయించిన అతుల్ తర్వాత కనిపించకుండా పోయారు. సన్నిహితుల ద్వారా ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే మే 27న సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త ఎంపీలు పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసినా అతుల్ మాత్రం హాజరు కాలేదు. ఆయన్ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న యూపీ పోలీసులు ఎంపీ ఆస్తుల స్వాధీనం కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో నెల రోజులుగా పరారీలో ఉన్న ఆయన శనివారం కోర్టులో లొంగిపోయారు. పోలీసుల అభ్యర్థన మేరకు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ రాయ్‌ను 14 రోజుల రిమాండ్ విధించారు. రాయ్ కోర్టుకు వచ్చే సమయంలో ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. అతుల్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. ఆయనపై ఇప్పటికే 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.


By June 23, 2019 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/accused-of-rape-case-bsp-mp-atul-rai-surrenders-in-court/articleshow/69910464.cms

No comments