Breaking News

అమ్మాయి కోసం తగువు.. చెన్నైలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య


అమ్మాయి కోసం జరిగిన గొడవలో రాయలసీమ యవకుడి చేతిలో తెలంగాణ విద్యార్థి హత్యకు గురైన సంఘటన రాజధాని నగరంలో చోటుచేసుకుంది. మృతుడు, హంతకుడు, అమ్మాయి చెన్నైలోని ‘చెన్నైస్‌ అమిర్త ఇంటర్నేషనల్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల’లోనే చదువుతున్నారు. ఇతర రాష్ట్రంలో చదువుకునేందుకు వెళ్లి ఒకరు విగతజీవిగా, మరొకరు హంతకుడిగా మారిన ఈ ఘటన మూడు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన షణ్ముఖ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ యువతి, నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన జి.శ్రావణ్‌కుమార్(20) చెన్నైలోని ‘చెన్నైస్‌ అమిర్త ఇంటర్నేషనల్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల’లో చదువుతున్నారు. వీరిద్దరూ పాకెట్ మనీ కోసం అక్కడే ఓ కాల్ సెంటర్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురికి పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. అయితే శ్రావణ్‌కుమార్‌తో ఆ యువతి సన్నిహితంగా మెలగడాన్ని షణ్ముఖ సహించలేకపోయాడు. శ్రావణ్‌తో మాట్లాడకూడదని యువతిని హెచ్చరించగా ఆమె పట్టించుకోలేదు. అదే విషయమై శ్రావణ్‌తోనూ గొడవపడ్డాడు. 26వ తేదీన శ్రావణ్‌కుమార్‌తో మరోసారి గొడవపడిన షణ్ముఖ వెంట తెచ్చుకున్న కత్తితో అతడి మెడపై పొడిచాడు. ఈ ఘటనతో భయపడిన అక్కడివారు బాధితుడిని ఆస్పత్రికి తరలించకపోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చెన్నై పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి శ్రావణ్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన చెన్నై వెళ్లి విగతజీవిగా పడివున్న కొడుకుని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం అనంతరం శ్రావణ్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించగా శుక్రవారం తడకమళ్ల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సుదర్శన్‌, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కొడుకు సృజన్‌ జనవరిలో రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లి ఇటీవలే కోలుకున్నాడు. రెండో కుమారుడు శ్రావణ్‌ ఉన్నత చదువు పూర్తిచేసి కుటుంబానికి అండగా ఉంటాడని ఆశించగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. బంధువులు, గ్రామస్థులకు సైతం వారిని ఓదార్చడం సాధ్యం కావడం లేదు.


By June 29, 2019 at 09:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-student-murdered-in-chennai/articleshow/69998477.cms

No comments