Breaking News

100 కిలోమీటర్ల దూరాన్ని 9.48 గంటల్లో పరుగెత్తిన ప్రకాశం వాసి!


మారథాన్‌లో పాల్గొనాలనే సంకల్పంతో ఓ యువకుడు కసితో పరిగెత్తి అందర్నీ అశ్చర్యంలో ముంచెత్తాడు. పది ఇరవై కాదు ఏకంగా 100 కిలోమీటర్ల దూరాన్ని 9.48 గంటల్లో పూర్తిచేసి ఔరా అనిపించాడు. ఇది ప్రకాశం జిల్లా యువకుడి ఘనత. బేస్తవారపేట మండలం పాపాయిపల్లికి చెందిన యువకుడు కసినబోయిన మహేష్‌ 9.48 గంటల్లో వంద కిలోమీటర్లు పరుగెత్తి ఆశ్చర్యపరిచాడు. వచ్చే జనవరిలో ముంబయిలో జరగనున్న మారథాన్‌లో పాల్గొనేందుకు సన్నాహకాల్లో భాగంగా ఈ ఘనత సాధించాడు. ద్విచక్ర వాహనాలపై మిత్రులు అతడి వెంట రాగా గురువారం రాత్రి 11.30 గంటలకు బేస్తవారపేట బస్టాండు నుంచి పరుగు ప్రారంభించాడు. అక్కడ నుంచి తాటిచర్ల మోటు, కొమరోలు, ఎడమకల్లు, గిద్దలూరు, తురిమెళ్ల, కంభం మీదుగా శుక్రవారం ఉదయం 9.18 గంటలకు తిరిగి బేస్తవారపేటకు చేరుకున్నాడు. కేవలం 9.48 గంటల్లోనే 100 కిలోమీటర్లు దూరాన్ని పూర్తి చేసిన మహేష్‌ను స్థానికులు అభినందించారు. మహేశ్ గతంలోనూ విజయవాడ, హైదరాబాద్‌, ముంబయి, విశాఖపట్నం, బెంగళూరు తదితర నగరాల్లో జరిగిన మారథాన్‌ పోటీల్లో పాల్గొన్నాడు. జనవరిలో జరగబోయే ముంబయి మారథాన్‌లో 42.195 కి.మీ. దూరాన్ని 2.11 గంటల్లో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తన లక్ష్యమని మహేష్‌ పేర్కొన్నాడు. టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో మొత్తం ఆరు విభాగాలు ఉంటాయి. ముంబై మారథాన్ 42.195 కిలోమీటర్లు, హాఫ్ మారథాన్ 21.097 కి.మీ., 10 కి.మీ. ఓపెన్, 5 కి.మీ. డ్రీమ్ రన్, 4.2 కి.మీ సీనియర్ సిటిజన్స్ రన్, 1.5 కి.మీ దివ్యాంగులకు నిర్వహిస్తోంది. మారథాన్‌లో 18 ఏళ్లు దాటిన వారు పాల్గొనవచ్చు. ఇక, 2020 మారథాన్‌కు 2018 జులై 29నే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన లోగోనూ మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ఆవిష్కరించారు. మొత్తం అన్ని విభాగాల్లోనూ ప్రైజ్ మనీ కింద 405000 అమెరికన్ డాలర్లు అందజేస్తారు.


By June 29, 2019 at 09:51AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/a-youth-from-prakasam-finished-100-kilometers-distance-in-9-48-hours/articleshow/69998460.cms

No comments