Breaking News

విజయనిర్మల కన్నుమూత, టాలీవుడ్‌లో విషాదం


టాలీవుడ్ ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె.. బుధవారం నాడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల.. దర్శకురాలుగా 44 చిత్రాలను రూపొందించి.. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విజయనిర్మల ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయ్యారు. మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఏడేళ్లకే బాలనటిగా.. విజయనిర్మల 1950లో ‘మత్య్సరేఖ’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో బాలనటిగా పరిచమయ్యారు. అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు. అక్కడ పలు చిత్రాల్లో నటించి... పదకొండో ఏట ‘పాండురంగ మహత్యం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. తెలుగులో ‘రంగులరాట్నం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు. నటించిన తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు . అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ‘సాక్షి’ చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణతో బంధం.. సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహ బంధానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించారు వీరిద్దరూ. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయ నిర్మల.


By June 27, 2019 at 07:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-actress-vijaya-nirmala-passed-away/articleshow/69966914.cms

No comments