డప్పు కొట్టడం ఆపు లోకేష్.. ప్రజల వాతలు పెట్టింది అందుకే: విజయసాయి
ప్రజావేదిక కూల్చివేతతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ ప్రభుత్వం కరకట్టపై అక్రమ నిర్మాణాలు కట్టినందుకే కూల్చేస్తున్నామని వైసీపీ అంటుంటే.. ప్రజా ధనంతో నిర్మించిన భవనాన్ని ఎలా కూలుస్తారని టీడీపీ వాదిస్తోంది. ఇటు అంచనాల వ్యవహారంపై కూడా నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ మంత్రి చేసిన ట్వీట్కు వైసీపీ ఎంపీ కౌంటరిచ్చారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ చేసిన విజ్ఞప్తితోనే అంచనాలకు ఆమోదం తెలిపారని విజయసాయి చెప్పారు. డప్పు కొట్టడం ఆపాలని లోకేష్కు చురకలంటించారు. విజయసాయి ట్వీట్లో.. ‘పోలవరం అంచనాల ఆమోదం, నిధుల గురించి వైఎస్ జగన్ గారు ప్రధానిని కలిసినప్పుడు కోరారు.దానికి స్పందనగానే రూ.55,548 కోట్ల సవరించిన అంచనాకు గ్రీన్ సిగ్నల్ దొరికింది.ఇది తన తండ్రి కష్టానికి ఫలితమని లోకేష్ డప్పుకొట్టు కోవడం ఆపాలి.ఖర్చు చేసిన నిధులకు లెక్కలు చూపకుండా మొండికేసిన చరిత్ర మీది’అంటూ ఎద్దేవా చేశారు. ‘రివర్ కన్జర్వేషన్ యాక్టును ఒకసారి చదవండి యనమల గారూ. ఎవరు తుగ్లకో తెలుస్తుంది. నదీ తీరాన్ని పూడ్చి కట్టిన నిర్మాణాలను తొలగించాలని డిమాండు చేయాల్సింది పోయి కాపాడాలని అడ్డుపడటం వింతగా ఉంది. ప్రకృతి వనరులను ధ్వంసం చేసినందుకే కదా ప్రజలు మీకు వాతలు పెట్టి తరిమేశారు’అంటూ యనమలకు కౌంటరిచ్చారు .
By June 26, 2019 at 12:29PM
No comments