Breaking News

దైవ దర్శనానికి వెళ్తూ మృత్యు ఒడికి చేరిన ముగ్గురు


దైవ దర్శనానికి వెళ్తున్న రెండు కుటుంబాలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. శనివారం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా హైదరాబాద్ వాసులే కావడంతో నగరంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కూకట్‌పల్లికి చెందిన సిద్దంశెట్టి గోపీకృష్ణ, అన్నంగి విజయకుమార్‌ తమ కుటుంబసభ్యులతో కలిసి నెల్లూరు జిల్లా జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయానికి శనివారం ఉదయం ఇన్నోవాలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు సమీపంలో మలుపు వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం, అతివేగం కారణంగా ఇన్నోవా డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునున్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సిద్దంశెట్టి గోపీకృష్ణ, ఆయన భార్య సుజాత, అన్నంగి విజయ్‌కుమార్ ప్రాణాలు కోల్పోగా... విజయ్‌కుమార్‌ భార్య తిరుపతమ్మ, ఆయన కోడలు పూజితతో పాటు ఇన్నోవా డ్రైవర్‌ వినీత్‌ తీవ్రంగా గాయపడ్డారు. విజయకుమార్‌ కొడుకు చైతన్య స్వల్పంగా గాయపడ్డాడు. వీరందరినీ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దంశెట్టి గోపీకృష్ణ ఎల్‌ఐసీ అధికారిగా పనిచేస్తుండగా.. అన్నంగి విజయకుమార్‌ రోల్డ్‌గోల్డ్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.


By June 23, 2019 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/road-accident-in-guntur-district-3-died-3injured/articleshow/69910680.cms

No comments