Breaking News

బంధుత్వం ప్రేమగా మారి విషాదాంతమైంది


తమ ప్రేమను పెద్దలు అంగీకరించరన్న ఆందోళనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో మంగళవారం జరిగింది. ఈ ఘటనలో ప్రేమికుడు ప్రాణాలు కోల్పోగా.. ప్రియురాలు మృత్యువుతో పోరాడుతోంది. రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన తాలూకు వివరాలివి. నల్గొండ జిల్లా పియోపల్లికి చెందిన సందీప్‌ రెడ్డి(27) ఎంఫార్మసీ చేశాడు. మూడు నెలల క్రితం ముంబయిలో ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులకు చెప్పి చేరాడు. చైతన్యపురిలో అద్దెకు గది తీసుకుని ఉంటున్నాడు. సందీప్‌కు బంధువైన దామరచర్లకు చెందిన యువతి(22) దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఇద్దరికీ చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. అయితే తమ ప్రేమ విషయం ఇంట్లో చెబితే పెద్దలు అంగీకరిస్తారో? లేదో? అన్న అనుమానం ప్రేమికుల్లో కలిగింది. ప్రేమ విషయం తెలిసి పెద్దలు తమను విడదీస్తే.. ఒకరిని విడిచి ఒకరం ఉండలేమన్న ఆందోళన వారిలో మొదలైంది. దీంతో కలిసి బతకలేనప్పుడు.. కలిసి చనిపోదామన్న నిర్ణయానికి వచ్చేశారు. యువతి సోమవారం రాత్రి సందీప్‌ రూమ్‌కి వెళ్లింది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత కూల్‌డ్రింకులో గుళికల మందు కలుపుకుని ఇద్దరూ తాగేశారు. వీరిని గమనించిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సందీప్ మృతిచెందగా.. యువతి ప్రాణాలతో పోరాడుతోంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న ఆందోళనతోనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని, ఇద్దరి సమాధి ఒకే దగ్గర కట్టాలన్నదే తమ చివరి కోరికంటూ వారు రాసిన లేఖను పోలీసులు సంఘటనా స్థలం నుంచి సేకరించారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. వారిద్దరూ ప్రేమించుకున్న సంగతి తమకు తెలియదని, రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు కూడా లేవని సందీప్‌రెడ్డి తండ్రి పోలీసులకు చెప్పారు. సందీప్ ముంబయిలో ఉంటున్నాడని అనుకున్నామని, పోలీసుల నుంచి సమాచారం వచ్చేవరకు ఈ విషయం తమకు తెలియదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


By June 26, 2019 at 09:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lovers-commits-suicide-attempt-in-hyderabad-chaitanyapuri/articleshow/69952572.cms

No comments