ప్రయివేట్ స్కూల్స్ ఫీజులపై పిల్.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అధిక ఫీజులు వసూలు చేస్తోన్న ప్రయివేట్ పాఠశాల దాష్టీకాలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దీనిపై గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి విచారణ జరుపుతామని తెలిపింది. దీనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్లతో కూడిన ధర్మాసనం ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రీకి స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటి గుర్తింపు రద్దుకు ఆదేశాలు జారీచేయాలని, అధిక ఫీజుల వసూలును అడ్డుకోవాలని కోరుతూ ప్రజా పార్టీ నేత, లాయర్ ఎన్ఎన్ గ్రేస్ ఈ వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల చట్ట నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని పలు ప్రైవేటు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు స్కూల్స్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు విక్రయించకుండా నిలువరించాలని, అధిక ఫీజులను అడ్డుకునేలా అధికారులను ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. అంతేకాదు, ఫీజులను నిర్థారించేందుకు పాఠశాల కరస్పాండెంట్ ఛైర్మన్గా, ప్రిన్సిపాల్ లేదా కార్యదర్శి వైస్ ఛైర్మన్గా, తల్లిదండ్రుల కమిటీ సభ్యుల్ని భాగస్వాములు చేస్తూ ప్రతి పాఠశాలలో ‘గవర్నింగ్ బాడీ’ని ఏర్పాటు చేయాలని గ్రేస్ కోరారు. జఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్, రాష్ట్రంలోని వివిధ జిల్లాల డీఈఓలు, శ్రీచైతన్య, నారాయణ, నెల్లూరు రవీంద్ర భారతి, భాష్యం, డాక్టర్ కేకేఆర్స్ గౌతమ్ పాఠశాలల్ని ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు లాయర్ శ్రావణ్కుమార్ వాదనలు వినిపించారు. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు విక్రయించొద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులిచ్చినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటి గుర్తుంపు రద్దు చేయాలని కోరారు. ఆ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. ప్రయివేట్ స్కూల్స్ అన్నీ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని అస్పష్టంగా పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘించిన పాఠశాలలను స్పష్టంగా తెలపాలని సూచించింది.
By June 26, 2019 at 10:10AM
No comments