Breaking News

పంజాగుట్టలో పట్టపగలే దారుణహత్య.. మృతుడికి ఏడుగురు సంతానం


నగరంలో ఇటీవల నడిరోడ్డుపైనే హత్యలు, దాడుల ఘటనలు తరుచూ జరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా దుండుగులు రెచ్చిపోతున్నారు. నగరంలోని కీలక ప్రాంతమైన పంజాగుట్ట సిగ్నల్ వద్ద బుధవారం సాయంత్రం నడిరోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ మరో డ్రైవర్‌ను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. కార్యాలయాలు, షాపింగ్‌మాల్స్‌తో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ హత్యతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పంజాగుట్ట సమీపంలో నివసించే అన్వర్‌ (32), ప్రతాప్‌నగర్‌కు చెందిన రియాసత్‌ అలీ (35) గతంలో స్నేహితులు. వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం ఇరువురికి తెలియడంతో బుధవారం పంజాగుట్ట సిగ్నల్స్ సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే రియాసత్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో అన్వర్‌ను పొట్టలో పొడిచాడు. అతడు ప్రాణాలు దక్కించుకునేందుకు సినీఫక్కీలో రోడ్డుపై పరుగులు తీయగా నిందితుడు అతడి వెంటపడి మరీ కత్తితో నరికాడు. దీంతో బాధితుడు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి కుర్చీలో కూలబడిపోయాడు. పోలీసులు వెంటనే 108కి ఫోన్ చేయగా వారు వచ్చేసరికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు నిందితుడు రియాసత్ పంజాగుట్ట ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ వద్దకు వెళ్లి లొంగిపోయాడు. అన్వర్‌ హత్యకు గురైనట్లు తెలుసుకున్న అతడి కుటుంబసభ్యులు, బంధువులు పంజాగుట్టకు చేరుకుని హంతకుడి ఆటోను ధ్వంసం చేశారు. మృతుడు అన్వర్‌కు ముగ్గురు మగ పిల్లలు, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


By June 27, 2019 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/an-auto-driver-brutally-killed-at-panjagutta-circle-in-hyderabad/articleshow/69968543.cms

No comments