Breaking News

పెళ్లి చేసుకుంటానని మహిళ నుంచి రూ.6.9కోట్లు నొక్కేశాడు


పెళ్లి పేరుతో మహిళలను మోసగిస్తున్న ఘరానా మోసగాడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న లేడీ డాక్టర్‌కు 2016లో చక్రవర్తి అనే ఓ యువకుడు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయమయ్యాడు. తాను అమెరికాలో డాక్టర్‌నని నమ్మించి పరిచయం పెంచుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఇండియా నుంచి వచ్చినట్లు చెప్పి ఆ డాక్టర్‌ను నేరుగా కలిసి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. దీనికి అంగీకరించిన లేడీ డాక్టర్ అతడికి దగ్గరైంది. అయితే తన తల్లి చనిపోవడంతో ఏడాదిన్నర తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె నమ్మింది. ఆమె ధనవంతురాలని తెలుసుకున్న చక్రవర్తి మోసానికి తెరదీశాడు. తాను ఫ్రెండ్స్‌తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటానని, ఓ స్థలం విషయంలో అర్జెంటుగా డబ్బు కావాలని నమ్మబలికి లేడీ డాక్టర్ నుంచి ఏకంగా రూ.6.9కోట్లు తీసుకున్నాడు. ఆ డబ్బు త్వరలోనే ఇచ్చేస్తానని చెప్పిన అతడు అప్పటి నుంచి కనిపించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు చెన్నై క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా చెన్నై పోలీసులు మోసగాడిని తిరువణ్ణామలైకి చెందిన చక్రవర్తిగా గుర్తించారు. అతడు గతంలోనూ చాలామంది మహిళలను ఇదేవిధంగా మోసం చేసినట్లు గుర్తించారు. వయసు మీరినా పెళ్లికాని, భర్త వదిలేసిన, భర్త చనిపోయిన ధనవంతులైన మహిళలే అతడి టార్గెట్ అని పోలీసులు చెబుతున్నారు. చక్రవర్తి ఇప్పటివరకు 9మంది మహిళలను వంచించి రూ.కోట్లలో దోచుకున్నట్లు గుర్తించారు. చక్రవర్తి బాగోతాలు వెలుగులోకి రావడంతో అతడి బాధితులు మరికొంతమంది తమను ఆశ్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.


By June 23, 2019 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/matrimony-cheating-in-tamilnadu-one-person-arrested/articleshow/69911515.cms

No comments