Breaking News

మోహన్‌బాబు రూపంలో ఏపీకి జ్యోతిష్కుడు


ఉగాది వచ్చింది...వికారి నామ సంవత్సరం మీద పంచాంగాలు వినిపించారు. కానీ ఇప్పుడు మోహన్‌బాబు రూపంలో ఏపీకి మరో జ్యోతిష్కుడు వచ్చాడు. దొంగలు పడ్డ ఎన్నో ఏళ్లకు కుక్కలు మొరిగినట్లుగా ఆయన విద్యానికేతన్‌కి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఇవ్వలేదనే సాకుతో మోహన్‌బాబు ఒక్కసారిగా దూకుడు పెంచాడు. ఆయన మాట్లాడుతూ, నాడు ఎన్టీఆర్‌ గెలుస్తారని చెప్పాను. ఎన్టీఆర్‌ గెలిచారు. నేడు జగన్‌మోహన్‌రెడ్డి గెలుస్తాడని చెబుతున్నా.. నా మాట తప్పుకాదు. ఆ షిరిడీ సాయినాధుని ఆశీర్వాదంతో ఈసారి జగన్‌ సీఎం కావడం ఖాయం. 

ఇక ప్రస్తుతం చంద్రబాబు టిడిపి నిజమైన టిడిపి కాదు. అది ఎన్టీఆర్‌ నుంచి లాక్కున్న టిడిపి. ఒక దశలో నేను చంద్రబాబుని బాగా నమ్మాను. ఆయన పంచన చేరాను. అందుకు ప్రతిఫలంగా నాపై చెప్పులు పడ్డాయి. ఏపీలో కులాల మధ్య చిచ్చు పెట్టిన ఘనుడు చంద్రబాబు. విదేశాలలోని తెలుగువారికి కూడా కులపిచ్చి అంటించింది చంద్రబాబే. 

చంద్రబాబు మీద నా వద్ద ఓ పుస్తకం ఉంది. అది బయటకు వస్తే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. అయినా నా స్థాయికి చంద్రబాబు తగిన వాడు కాదు. ఓటుకు నోటు కేసులో భయపడి హైదరాబాద్‌ నుంచి చంద్రబాబు పారిపోయాడు. చంద్రబాబుకి అంత ఆస్తులు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. అందరిపై విమర్శలు చేసే చంద్రబాబే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కాళ్లు కడిగి ఆ నీరు నెత్తిన పోసుకుంటాడని మోహన్‌బాబు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయినా చంద్రబాబు మీద తన వద్ద పుస్తకం ఉందని చెబుతున్న మోహన్‌బాబు అదేమిటో ప్రింట్‌ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తే జనాలు చదివి నిజాలు తెలుసుకుంటారు కదా...! అంతేగానీ ఉంది.. ఉంది.. అంటూ అలా ఊరించడం చూస్తే దాని వెనుక ఏదో మతలబు ఉంది. 

ఎందుకంటే చంద్రబాబు అవినీతిని, వెన్నుపోటుని ప్రతిబింబిచే ఆ పుస్తకం బయట పెడితే అందులో ఏ1 ముద్దాయిగా మోహన్‌బాబు కూడా ఉంటాడనే విషయం అర్దమవుతోంది. ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన సమయంలో ఆయన కూడా ఓ చేయి వేసిన విషయం ప్రజలకు బాగానే గుర్తు ఉంటుందని చెప్పాలి. తన వ్యాపారాలు, అధికార బలం కోసం నాడు మోహన్‌బాబు అందరి పంచన చేరి రాజకీయాలు చేసిన విషయం నిజం కాదా? అన్నదే ప్రశ్న. 



By April 09, 2019 at 09:52AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/45475/mohan-babu.html

No comments