Breaking News

అత్తా అల్లుళ్ల మధ్య విబేధాలు.. ప్రశాంత్ కిశోర్‌ను మధ్యలోకి లాగిన టీఎంసీ నేత


పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు మధ్య విబేధాలు తలెత్తినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో తృణమూల్ ముఖ్య నేతలతో సీఎం మమతా బెనర్జీ అత్యవసర సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకరికి ఒకే పదవి అనే విధానానికి అభిషేక్ బెనర్జీ ఒత్తిడి తేవడంతో జోడు పదవుల్లో ఉన్న పలువురు నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మమతా అత్యవసర సమావేశం ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. కానీ చాలామంది దీనిని దీదీ, ఆమె మేనల్లుడు మధ్య పెరుగుతున్న విబేధాలుగా చూస్తున్నారు. మమత తర్వాత టీఎంసీలో అభిషేక్ సుపీరియర్ నేత అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, అత్తా, అల్లుళ్ల విబేధాల్లో ప్రశాంత్ కిశోర్‌కి చెందిన ఇరుక్కుంది. గతేడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయంలో పీకే కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. కాగా, ఐ-ప్యాక్‌పై తృణమూల్ నేత చంద్రిమా భట్టాచార్య ట్విట్టర్ వేదికగా శుక్రవారం ఆరోపణలు గుప్పించడంతో వివాదం చెలరేగింది. తన సోషల్ మీడియా ఖాతాలను ప్రశాంత్ కిషోర్ బృందం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ‘‘ఎన్నికల ముందు నా పేరు మీద ట్విట్టర్ ఖాతాను సృష్టించింది.. ఈ రోజు అది నాకు తెలియకుండానే ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ గురించి పోస్ట్ చేసింది.. నేను దానిని తీవ్రంగా నిరసిస్తున్నాను’’ అని భట్టాచార్య వ్యాఖ్యానించారు. దీనికి ఐ-ప్యాక్ కూడా దీటుగా కౌంటర్ ఇచ్చింది. తాము టీఎంసీ లేదా ఆ పార్టీ నేతలకు చెందిన ఎటువంటి డిజిటల్, సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. ఎవరైనా అటువంటి ఆరోపణలు చేస్తే అందులో ఏమాత్రం నిజం లేదని ఉద్ఘాటించింది. కాగా, యూపీలో అఖిలేశ్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్లిన మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మేనల్లుడితో విబేధాలపై ప్రచారానికి బలం చేకూర్చేవిగా ఉన్నాయి. గోవాలో ప్రచారానికి వెళ్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అక్కడ ఎవరో చేస్తున్నారు.. నేను కాదు.. నేను ఎంతో ఆసక్తితో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాను’ అని ఆమె బుదులిచ్చారు. గోవాలో టీఎంసీ బాధ్యతలను అభిషేక్ బెనర్జీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా విషయంలోనూ అంతర్గత విబేధాలు తలెత్తినట్టు ప్రచారం జరిగింది. పార్టీలోని సీనియర్ లీడర్లను పక్కనబెట్టేందుకు ప్రయత్నించారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అలాగే, ఇటీవల గంగాసాగర్ మేళా మమతా బెనర్జీ, అభిషేక్‌ల మధ్య విబేధానికి ఆజ్యం పోసినట్టు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని వెల్లడించింది. గంగా సాగర్‌లో మకర సంక్రాంతి మేళాకు మమతా బెనర్జీ ఆమోదముద్ర వేయగా, అన్ని మతపరమైన, రాజకీయ కార్యకలాపాలను నిలిపివేయాలని అభిషేక్ పిలుపునిచ్చారని నివేదించింది. కరోనాను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారని కూడా పేర్కొంది.


By February 12, 2022 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-cm-mamata-banerjee-and-nephew-rift-grow-prashant-kishor-i-pac-caught-in-middle/articleshow/89517446.cms

No comments