Breaking News

పీఎం కిసాన్ పథకం నిధుల పెంపుపై జోరుగా ప్రచారం.. వ్యవసాయ మంత్రి కీలక వ్యాఖ్యలు


వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ మేం ఒక అడుగు వెనక్కి వేశామని, కానీ తప్పకుండా మళ్లీ ముందడుగు వేస్తామని ప్రకటించడంతో మళ్లీ వాటిని తీసుకొస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే, మూడు సాగు చట్టాలను భవిష్యత్తులో తిరిగి తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ స్పష్టంచేశారు. ఈ చట్టాలను మళ్లీ తీసుకొచ్చే ఆలోచన కేంద్రానికి ఉందా? అని రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన ద్వారా ఫిబ్రవరి 8, 2022 నాటికి దేశవ్యాప్తంగా 11.78లక్షల మందికిపైగా రైతులకు దాదాపు రూ.1.82లక్షల కోట్ల పలు వాయిదాల రూపంలో సాయం అందించినట్టు ఆయన తెలిపారు. అయితే, వీరిలో 48.04 లక్షల మందిని అనర్హులుగా గుర్తించామని పేర్కొన్నారు. అందువల్ల ఈ పథకం కింద 11.30 కోట్ల మంది మాత్రమే అర్హులు ఉన్నారని చెప్పారు. అంతేకాదు, పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు ప్రస్తుతం ఇస్తున్న సాయాన్ని పెంచే ప్రతిపాదన ఇప్పటికైతే లేదని మంత్రి స్పష్టంచేశారు. పీఎం కిసాన్‌ యోజన పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేలను మూడు విడతల్లో అందజేస్తోంది. ఈ సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు తొలి విడత, ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండో విడత, ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30 వరకు మూడో విడత కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. గత మూడేళ్ల నుంచి నిరంతరయంగా ఈ పథకం సాగుతోంది. అయితే, పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని, సాయాన్ని రెట్టింపు చేయాలని యోచిస్తోందని ప్రచారం జరిగింది. రూ.6000 బదులుగా.. రూ.12000కు పెంచుతారని, యూపీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, అందంతా తప్పుడు ప్రచారమేనని మంత్రి సమాధానంతో తేలిపోయింది. అలాగే, 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రధాన వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల విలువ రూ.2,52,297 కోట్లుగా ఉందన్న కేంద్రమంత్రి.. ఇది ప్రస్తుత ధరల ప్రకారం మన దేశ జీడీపీలో 1.2 శాతమని తెలిపారు. 2020-21లో కరోనా మహమ్మారి సంక్షోభం ఉన్నా వ్యవసాయ ఎగుమతుల్లో 22.8 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు.


By February 12, 2022 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-agricultural-minister-calrifying-about-pm-kisan-yojana-scheme-funds-doubling-and-farm-laws/articleshow/89516648.cms

No comments