Breaking News

ఘనంగా ‘తెలుగు తల్లికి పద్యాభిషేకం’.. తానా కార్యక్రమంలో పలువురు లబ్దప్రతిష్ఠులు


తానా ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న ‘నెల నెలా తెలుగు వెలుగు’లో భాగంగా ఫిబ్రవరి 27 న ‘’ అనే కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా జరిగింది. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రారంభించారు. తక్కువ మాటలతో ఎక్కువ భావాలను పలికించగల శక్తి పద్యానికున్నదని, పద్యం రాయగల్గడం ఒక ప్రత్యేక కళ అని, ఈ నాటి కార్యక్రమంలో ఇంతమంది లబ్దప్రతిష్ఠులు పాల్గొనడం చాలా సంతోషం అంటూ అతిథులందరకూ ఆహ్వానం పలికారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ఏ ఇతర భాషలకూ లేని పద్యం, అవధానం లాంటి సౌందర్యం, సొగసులు మన తెలుగు భాషకున్నాయని, ఇంతటి ఘనమైన మన మాతృభాషా పరిరక్షణ, పర్వ్యాప్తి కోసం తానా కంకణం కట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా అవిరళ కృషి చేస్తుంది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ డాక్టర్ వెలుగోటి భాస్కర సాయికృష్ణ యాచేంద్రను తోటకూర సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా రాజులు సంగీత, సాహిత్య, నృత్యాంశాలను అభిమానిస్తూ, ఆదరిస్తుంటారు. కాని వేంకటగిరి సంస్థానంలో వెలుగోటి రాజవంశంలో జన్మించిన డాక్టర్ సాయి కృష్ణ యాచేంద్ర స్వతహాగా సంగీత సాహిత్య ప్రతిభామూర్తి కావడం, మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో పీహెచ్‌డీ పట్టా పొందడం విశేషం అన్నారు. డా. సాయి కృష్ణ యాచేంద్ర తన కీలకోపన్యాసం చేస్తూ.. ‘‘సాహిత్యలోకంలో అంతగా ప్రచారం లేని ప్రముఖ యోగిని, గొప్ప కవయిత్రి తరిగొండ వెంగమాంబ కలం నుంచి ‘భాగవతం’, ‘వేంకటాచల మహత్మ్యం’, ‘రమా పరిణయం’, ‘యక్షగాన కృతులు’, ‘శివ నాటకం’ లాంటి అనేక ఉత్తమ సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయి.. 12 స్కందాల భాగవతంలో 7, 8, 9, స్కందాలు అలభ్యంగా ఉన్నాయి.. వాటి కోసం శోధించాల్సిన అవసరం ఉందన్నారు. బాల వితంతువైన వెంగమాంబ ఎక్కువ కాలం ధ్యాన యోగంలో గడిపేవారు.. ఆనాటి సామాజిక పరిస్థితుల వల్ల తాను నిరాదరణకు గురైనా వాటినన్నింటినీ తట్టుకుంటూ ఎదురు నిల్చి పోరాడిన ఆమె జీవితం నారీ జనాభ్యుదయానికి నాందీ గీతంగా నిలుస్తుందని అన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన ప్రముఖ కవి, నటుడు, గాయకుడు, వ్యాఖ్యత డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ, ప్రముఖ రచయిత, నటుడు, సంగీత నవావధాని, కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి; పరవస్తు పద్యపీఠం, తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణి శయనసూరి; ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలం తెలుగు భాషా సాహిత్య వికాసాలకు అంకితమై పద్యపరిమళం యుట్యూబ్ ఛానల్ ద్వారా పద్యాభిషేకం చేస్తున్న పాతూరి కొండల్ రెడ్డి; ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పని చేసిన ప్రముఖ సినీ, జానపద, శాస్త్రీయ గాయకులు చంద్ర తేజ; కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి, ఆకాశవాణి లలిత సంగీతంలో ఉత్తమ శ్రేణి కళాకారుడుగా గుర్తింపు పొందిన మధుర గాయకులు తాతా బాలకామేశ్వరరావులు, సుప్రసిద్ధ సాహితీ వేత్తలు, కవులు, పండితులు, రచయితలు సృస్టించిన సాహిత్యం, చలన చిత్రాల నుంచి అనేక పద్యాలను శ్రావ్యంగా ఆలపించారు. తమ గాన మాధుర్యంతో తెలుగు తల్లికి పద్యాభిషేకం చేసి అందర్నీ పరవశింపజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథి, గౌరవ అతిథులకు, సహకారం అందిస్తున్న ప్రసార మాధ్యమాలకు డాక్టర్ ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలను తెలియశారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మార్చి 27 న పౌరాణిక నాటక వైభవం అనే 34 వ సాహిత్య కార్యక్రమం అంతర్జాల దృశ్య సమావేశంగా జరుగుతుందని ప్రకటించారు. తెలుగు తల్లికి పద్యాభిషేకం కార్యక్రమాన్ని ఈ కింది లింకులో వీక్షించ వచ్చును.


By February 28, 2022 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/telugu-talliki-padyabhishiekam-event-orgnised-by-tana-prapancha-sahitya-vedika/articleshow/89883289.cms

No comments