Breaking News

క్రిప్టో కరెన్సీ కోసం సైబర్ దాడులు.. ఉ.కొరియాకు ఇదే ముఖ్య ఆదాయ వనరు!


అంతర్జాతీయ ఆంక్షలు, అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇటీవల ఒక్క జనవరిలోనే ఏడు క్షిపణి ప్రయోగాలను నిర్వహించడం యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. అమెరికాకు చెందిన గ్వామ్‌ దీవిని కూడా చేరుకోగల మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశం ప్రకటించడం గమనార్హం. అయితే, గతేడాది అణు పరీక్షలు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలకు ఉత్తర కొరియా దూరంగా ఉంది. కానీ చాపకింద నీరులా అణు, క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలను మాత్రం యథావిధిగా కొనసాగించినట్లు ఓ నివేదిక తెలిపింది. ఆంక్షల పర్యవేక్షణ సంస్థలు (శాంక్షన్‌ మానిటర్స్‌) ఈ వ్యవహారంపై ఓ నివేదికను రూపొందించి తాజాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీకి శుక్రవారం అందజేసినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది. అంతర్జాతీయ ఆంక్షలు, కరోనా వైరస్‌తో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఉన్న ఆ దేశం.. అణు పరీక్షలకు అవసరమైన నిధులను ఎలా సేకరించిందో కూడా నివేదిక తేటతెల్లం చేసింది. కోసం ఉత్తర కొరియా సైబర్ దాడులకు పాల్పడి.. ఆదాయాన్ని సమకూర్చుకుంటోందని వివరించింది. ‘ఉత్తర కొరియాపై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ గతేడాది అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి ప్రక్రియను నిరంతరం కొనసాగించింది. వీటికి సంబంధించిన పరికరాల సేకరణ, శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు చేపట్టింది’ అని నివేదిక పేర్కొంది. క్రిప్టో కరెన్సీ కోసం సైబర్‌ దాడులకూ పాల్పడినట్లు తెలిపింది. 2020 నుంచి 2021 మధ్యలో సైబర్ దాడుల ద్వారా 50 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిందని, క్రిప్టో కరెన్సీనే ఆ దేశానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉందని వెల్లడించింది. ‘‘సైబర్ దాడుల ద్వారా ఉత్తర కొరియా గత ఏడాది 400 మిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ ఆస్తులను సంపాదించి ఉంటారు’’ని గత నెలలో ఓ భద్రత సంస్థ ప్రచురించిన అధ్యయనాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది. 2019లో ఉత్తర కొరియా అధునాతన సామూహిక విధ్వంసక కార్యక్రమాల కోసం 2 బిలియన్ డాలర్లు సేకరించినట్లు ఐరాస నివేదించింది. ఉత్తర కొరియా అణు, ఆయుధ కార్యక్రమాలపై ఐరాస భద్రతా మండలి ఆంక్షలు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీంతోపాటు బొగ్గు, ఇనుము, సీసం, వస్త్రాలు, మత్స్య, ఇతర ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం ఉంది. ఒకవైపు పశ్చిమ దేశాలు ప్యోంగ్యాంగ్‌పై మరింత ఒత్తిడి పెంచుతుండగా.. మరోవైపు చైనా, రష్యాలు మాత్రం మానవతా దృక్పథంతో ఆంక్షలను సడలించాలని కోరుతున్నాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియా అణు, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలకు అవసరమైన అవస్థాపన సౌకర్యాల అభివృద్ధిని కొనసాగిస్తోంది. ఉమ్మడి శాస్త్రీయ పరిశోధనలతో సహా విదేశాలలో మెటీరియల్, టెక్నాలజీ, సాంకేతికతను కొనుగోలు చేసింది. అటు, ఒక్క నెలలోనే ఉత్తర కొరియా 9 క్షిపణి పరీక్షలను నిర్వహించినట్టు అమెరికా ఆరోపించింది.


By February 07, 2022 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/north-korea-missile-programme-funded-through-stolen-crypto-says-un-report/articleshow/89395595.cms

No comments