Breaking News

ఒలింపిక్ టార్చ్‌బేరర్‌గా అతడు.. చైనాలోని ఈవెంట్‌‌పై భారత్ కీలక నిర్ణయం


బీజింగ్‌లో జరిగే ఆరంభం, ముగింపు వేడుకలకు చైనాలోని భారత ప్రతినిధులు ఎవ్వరూ హాజరుకాబోరని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఒలింపిక్ రిలేలో భారత్‌తో గాల్వాన్ లోయ ఘర్షణల్లో పాల్గొన్న సీపీఎల్ఏ రెజ్మింట్ కమాండర్ టార్చ్‌బేరర్‌గా వ్యవహరించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రీడా వేడుకల్లో ఓ మిలటరీ కమాండర్‌ను సత్కరించాలని చైనా తీసుకున్న నిర్ణయం విచారకరమని భారత్ అభివర్ణించింది. అంతేకాదు, వింటర్ ఒలింపిక్స్‌ను చైనా రాజకీయం చేస్తోందని ఆరోపించింది. మరోవైపు, భారత్ వింటర్ ఒలింపిక్స్ 2022ని బహిష్కరించనప్పటికీ ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని ప్రభుత్వం పంపలేదు. చైనాలోని అగ్రశ్రేణి భారతీయ దౌత్యవేత్త దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని భావించినా తాజా నిర్ణయంతో అది కూడా లేదని తేలిపోయింది. ‘‘ఒలింపిక్స్ వంటి ఈవెంట్‌ను రాజకీయం చేయడానికి చైనా మొగ్గుచూపడం నిజంగా విచారకరం.. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు వింటర్ ఒలింపిక్స్ 2022 ప్రారంభ లేదా ముగింపు వేడుకలకు హాజరు కావడం లేదని తెలియజేయాలని అనుకుంటున్నాను’ విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. అటు, చైనా చర్యలను అగ్రరాజ్యం అమెరికా సైతం తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ముమ్మూటికీ రాజకీయ కుట్ర కోణమేనని మండిపడింది. కాగా, ఇటీవల అరుణాచల్ యువకుడిని అపహరించిన చైనా సైన్యం.. చిత్రహింసలకు గురిచేయడాన్ని భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. ఈ విషయాన్ని చైనా అధికారుల దృష్టి తీసుకెళ్లినట్టు ధ్రువీకరించింది. మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల బాలుడు తన స్నేహితుడితో కలిసి వేటకు వెళ్లగా జనవరి 18న ఎల్ఏసీ సమీపంలో సీపీఎల్ఏ సైనికులు అపహరించారు. తనకు కరెంట్ షాక్ ఇచ్చి, దారుణంగా కొట్టారని వారి చెర నుంచి విడుదలైన తర్వాత తరోన్ వెల్లడించాడు.


By February 04, 2022 at 07:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-diplomats-to-boycott-winter-olympics-over-china-torchbearer/articleshow/89335286.cms

No comments