Breaking News

ప్రికాషనరీ డోసుపై కేంద్రం గుడ్ న్యూస్.. కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరలేదు


ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి భయంతో చాలా దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను అందజేస్తున్నాయి. తాజాగా, భారత్ కూడా పేరిట బూస్టర్ డోస్‌కు ఆమోదం తెలిపింది. జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ పంపిణీ ప్రారంభం కానుంది. తొలి దశలో 60 ఏళ్లుపైబడి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ప్రికాషన్ డోస్ అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ డోస్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య సంరక్షణ శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. రెండు డోస్‌ల టీకా తీసుకున్న 60 ఏళ్లుపైబడి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి ప్రికాషన్ డోస్ తీసుకోవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం విడుదల చేయనున్నారు. ‘‘ప్రికాషన్ డోస్ షెడ్యూల్‌ను జనవరి 8న వెల్లడిస్తాం.. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ సైతం శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యింది.. వ్యాక్సినేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ జనవరి 10 నుంచి ప్రారంభమవుతుంది’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్ లైన్ లో అపాయింట్మెంట్ తీసుకోదలచిన వారు శనివారం నుంచి కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది. తొలి రెండు డోస్‌లు ఏ టీకా తీసుకున్నారో దానినే ప్రికాషనరీ డోస్‌గా వేసుకోవాలని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్ డోస్‌లు గతంలో ఇచ్చిన విధంగానే ఉంటుంది.. కొవాగ్జిన్ పొందిన వారు కొవాగ్జిన్.. కొవిషీల్డ్‌ డోస్‌లు వేసుకున్నవారు అదే టీకాను తీసుకోవాలి’’ అని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వీకే పాల్ తెలిపారు. టీకా రెండు డోసుల తీసుకున్నా ఒమిక్రాన్ బారినపడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా వృద్ధుల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని గుర్తించిన ఐసీఎంఆర్.. వారికి ప్రికాషనరీ డోసును సిఫార్సు చేసింది.


By January 08, 2022 at 10:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/new-registration-not-needed-for-covid-vaccine-precautionary-dose-says-centre/articleshow/88769941.cms

No comments