Breaking News

ఆన్‌లైన్‌లో మహిళల ఆత్మగౌరవం తాకట్టు.. ‘బుల్లి బయ్’ అభ్యంతరక ఫోటోలతో వేలం!


ముస్లిం మహిళల ఫోటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టిన ‘బుల్లీ బయ్‌’ యాప్‌ వ్యవహారంపై ముంబయి, ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్త ఏడాది వేళ మహిళల ఆత్మగౌరవాన్ని ఆన్‌లైన్‌లో తాకట్టు పెట్టిన ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో బుల్లీ బయ్ యాప్‌ నిర్వాహకులకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని దానికి హోస్టింగ్‌ సేవలు అందించిన గిట్‌హబ్‌ సంస్థను సోమవారం ఆదేశించారు. అలాగే, ఆ యాప్‌ సంబంధిత సమాచారాన్ని ట్విటర్‌లో తొలిసారిగా ఎవరు పోస్ట్‌ చేశారు? వారికి ఆ యాప్‌ గురించి ఎలా తెలిసింది అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ట్విటర్‌కు లేఖ రాశారు. ఆ యాప్‌ సంబంధిత పోస్టులతోపాటు ఇతర అభ్యంతరకర సమాచారాన్ని తొలగించాలని ట్విటర్‌ను ఆదేశించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ‘బుల్లీ బయ్‌’ యాప్‌ వ్యవహారాన్ని ఢిల్లీ మహిళా కమిషన్‌ కూడా తీవ్రంగా పరిగణించింది. ఈ యాప్‌నకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించింది. జనవరి 6న తమ ముందు హాజరుకావాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మరోవైపు, ఈ కేసుకు ముంబయి సైబర్ సెల్ పోలీసులు బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అనుమానిత యువకుడి వివరాలను వెల్లడించలేదు. యువకుడిపై ఐపీసీ సెక్షన్లు, ఐటీ చట్టం కింద కేసులు నమోదుచేశారు. బుల్లి బాయ్ యాప్‌లో ఓ మహిళకు చెందిన అసభ్యకరమైన ఫోటోలను అప్‌లోడ్ చేసి వేలానికి ఉంచడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కుట్రదారులపై ఐపీసీ సెక్షన్ 153(ఏ), (బి), 295 (ఏ) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించిందని కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ, ముంబయి పోలీసులతో కలిసి భారత ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.


By January 04, 2022 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/engineering-student-detained-in-bengaluru-in-bulli-bai-case/articleshow/88680095.cms

No comments