Breaking News

మొన్న కృత్రిమ సూర్యుడు.. నేడు కృత్రిమ జాబిల్లి: శాస్త్ర పరిశోధనల్లో చైనా మరో అద్భుతం


శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో చైనా అద్భుతాలను సాధిస్తూ ప్రపంచాన్ని నివ్వేరపోయేలా చేస్తోంది. ఇటీవల ‘కృత్రిమ సూర్యుడి’ని 17 నిమిషాల పాటు మండించి డ్రాగన్ శాస్త్రవేత్తలు చరిత్రను తిరగరాసిన విషయం తెలిసిందే. తాజాగా, చందమామపై ప్రయోగాల్లో మరో అద్భుతం చేసింది. చంద్రమండలంపై పరిస్థితులను అనుకరించేందుకు ఒక బుల్లి చందమామను సృష్టించింది. అంతేకాదు, అందులోని గురుత్వాకర్షణ శక్తినీ మాయం చేయడం విశేషం. భవిష్యత్‌లో చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేయడానికి వీలుగా దీన్ని సిద్ధం చేసింది. ఇలాంటి సాధనం ప్రపంచంలో మరెక్కడా లేకపోవడం విశేషం. జియాంగ్సు ప్రావిన్స్‌లోని షుజౌ నగరంలో ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ చందమామను కొద్ది నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది. వ్యోమగాములను రోదసిలోకి పంపడానికి ముందు భారరహిత స్థితిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రస్తుతం ‘జీరో గ్రావిటీ’ విమానాలను ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాలు ఒక పద్ధతిలో ప్రయాణించే క్రమంలో అందులోని వారు కొద్దిసేపు భారరహిత స్థితికి గురవుతారు. అలాగే డ్రాప్‌ టవర్‌ నుంచి కిందకు జారిపడే క్రమంలోనూ కొన్ని నిమిషాల పాటు ఈ పరిస్థితిని అనుభవించొచ్చు. భూమితో పోలిస్తే చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతు ఉంటుంది. చైనా సృష్టించిన చందమామలోనూ అదే తరహా పరిస్థితులు ఉంటాయి. ఇతర వాటికి భిన్నంగా ఇందులో కోరుకున్నంతసేపు అలాంటి పరిస్థితిని కొనసాగించవచ్చు. చంద్రుడిపై ఉండే గురుత్వాకర్షణ శక్తిని భూమి మీద సృష్టించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం చైనా శాస్త్రవేత్తలు శక్తిమంతమైన అయస్కాంతాలను ఉపయోగించారు. ఈ చందమామ ‘మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌’ ఆధారంగా పనిచేస్తుంది. కృత్రిమ చంద్రుడిలో ప్రధానంగా రెండు చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గది, ఒక వాక్యూమ్‌ చాంబర్‌ ఉంటాయి. చంద్రుడి ఉపరితలంపై ఉండే తేలికపాటి శిలలు, ధూళితో ఈ గదిని రూపొందించారు. గాలిలేని వాక్యూమ్‌ చాంబర్‌పై గదిని నిర్మించారు. శక్తిమంతమైన అయస్కాంతాల సాయంతో చాంబర్‌లో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే ఆ గది గాల్లోకి లేస్తుంది. ఫలితంగా అందులో చందమామ తరహా పరిస్థితులు ఏర్పడతాయి. కృత్రిమ జాబిల్లిలోని అపార అయస్కాంత శక్తి తాకిడికి సూపర్‌ కండక్టింగ్‌ వైర్లు, ఇతర సాధనాలు పేలిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు భారీ అయస్కాంతాల కారణంగా అనేక లోహపు భాగాలు సక్రమంగా పనిచేయవు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి చైనా శాస్త్రవేత్తలు.. అయస్కాంత క్షేత్ర సమక్షంలో చాలా సులువుగా తేలియాడే చంద్రుడి ధూళి కణాలను రూపొందించారు. కీలకమైన పరికరాల్లో ఉక్కు స్థానంలో అల్యూమినియంను ఉపయోగించారు. 2027 నాటికి చంద్రుడిపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోనన చైనా.. చాంగే-6, 7, 8 వ్యోమనౌకల ద్వారా పరిశోధనలు కొనసాగించాలని యోచిస్తోంది. చాంగే-7 వ్యోమనౌకను చంద్రుడి దక్షిణార్థ గోళంలో దింపడానికి ప్రణాళికలు రూపొందించింది. అంతేకాదు, 2030 నాటికి మనుషులను పంపాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ క్రమంలో సాయంతో వ్యోమగాములకు మెరుగైన శిక్షణ ఇవ్వడం, కొత్త రోవర్లు, సాంకేతిక పరిజ్ఞానాలను సులువుగా పరీక్షించడం జరుగుతుంది. త్రీడీ ప్రింటింగ్‌ వంటి పరిజ్ఞానం సాయంతో చంద్రుడిపై డిజైన్లను రూపొందించొచ్చా? అనేది ముందే తెలుసుకోవచ్చు. దీనిలో నిర్వహించే కొన్ని ప్రయోగాల ద్వారా.. చంద్రుడి ఉపరితలంపై నీటి జాడను కనుగొనడానికి అనువైన ప్రదేశాలపై ఒక అవగాహనకు రావొచ్చు. రష్యాలో జన్మించి బ్రిటన్‌‌లో స్థిరపడిన శాస్త్రవేత్త, ఫిజిక్స్‌లో నోబుల్ అవార్డు గ్రహీత ఆండ్రే గెయిమ్‌ గతంలో ‘మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌’తో ఒక కప్పను గాల్లోకి లేపారు. తాజాగా, కృత్రిమ చందమామ సృష్టికి ఆయన ప్రయోగాన్నే చైనా స్ఫూర్తిగా తీసుకుంది. చైనా మైనింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన లీ రుయిలిన్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ప్రయోగంపై లీ రుయిలిన్ మాట్లాడుతూ.. ‘విమానం లేదా డ్రాప్ టవర్‌లో తక్కువ గురుత్వాకర్షణ సాధించగలిగినప్పటికీ అది స్వల్పకాలమే ఉంటుంది.. సిమ్యులేటర్‌లో ఆ ప్రభావం కావలసినంత కాలం ఉంటుంది’ అని అన్నారు. ‘ఇంపాక్ట్ టెస్ట్ వంటి ప్రయోగాలకు కేవలం కొన్ని సెకన్లు మాత్రమే అవసరం.. కానీ క్రీప్ టెస్టింగ్ వంటి ప్రయోగాలకు చాలా రోజులు పట్టవచ్చు’ అని లీ వ్యాఖ్యానించారు.


By January 18, 2022 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/china-builds-artificial-moon-to-mimic-lunar-environment-on-earth/articleshow/88963950.cms

No comments