Breaking News

దేశంలో గూఢచర్యం కలకలం.. చైనా ట్యాగ్‌లతో పట్టుబడిన పావురాలు


కాలికి చైనా ట్యాగ్‌లతో ఉన్న ఓ పావురాలు గత కొద్ది రోజుల నుంచి ఒడిశాలో కనిపించడం కలకలం రేగుతోంది. సుందర్‌గఢ్ రాజ్‌గంగ్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్‌బహాల్ గ్రామంలో గాయంతో ఓ పావురం కింద పడిపోయింది. ఆ పావురాన్ని రక్షించేందుకు సర్బేశ్వర్ చొత్రాయ్ అనే వ్యక్తి ప్రయత్నించాడు. పావురాన్ని కాపాడే క్రమంలో కాలికి చైనా ట్యాగ్ ఉన్నట్లు అతడు గుర్తించాడు. దానిపై చైనీస్ భాషలో అక్షరాలు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అధికారులు హూటాహుటిన రంగంలోకి దిగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపి ఉంటారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ‘‘ఇతర పక్షుల మాదిరిగా ఎగరకుండా ఉన్న ఓ పావురాన్ని మేము గుర్తించాం.. దానిని పట్టుకుని పరిశీలించగా కాలుకు ఓ రింగు ఉండటం గమనించాం.. దానిపై చైనా భాషలో అక్షరాలు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చాం’’ అని సర్బేశ్వర్ చొత్రాయ్ అన్నారు. అలాగే, పూరీ-కోణార్క్ మార్గంలో అనుమానాస్పదంగా మరో పావురం కనిపించింది. దీని రెండు కాళ్లపై రింగులు ఉండగా.. కోడ్ భాషలో సీరియల్ నెంబర్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ పక్షులను గూఢచర్యానికి చైనీయులు ఉపయోగిస్తున్నారని అనుమానం కలుగుతోందని పూరీకి చెందిన అలోక్ పాలేయ్ అన్నారు. కాళ్లకు అమర్చిన రింగులపై ఉన్న కొండ గుర్తులు చూస్తే ఇవి చైనా గూఢచారి పావురాలేనని అర్ధమవుతోందని తెలిపారు. ఇదే సమయంలో ఒడిశాకు చెందిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి నిహార్ రంజన్ బిశ్వాల్ మాట్లాడుతూ.. ‘బ్యాడ్జ్‌లపై ఎటువంటి అక్షరాలు, కెమెరా, ఎలక్ట్రానిక్ పరికరాలు, చిప్‌లు లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని వివరించారు. అంతేకాదు, స్థానికులు కూడా కొన్నిసార్లు తమ పక్షులను గుర్తించడానికి కొన్ని బ్యాడ్జ్‌లను పెడుతుంటారని తెలిపారు.


By January 05, 2022 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pigeons-with-chinese-badge-on-legs-found-in-puri-in-odisha/articleshow/88701907.cms

No comments