Breaking News

పరాయి చట్టాలను గుడ్డిగా అనుసరించకూడదు: వైవాహిక అత్యాచారంపై కేంద్రం స్పందన


‘వైవాహిక అత్యాచారాన్ని’ నేరంగా పరిగణించాలంటూ ఆర్ఐటీ, ఆల్ ఇండియా డెమొక్రాటిక్ ఉమెన్స్ ఫౌండేషన్లు ఢిల్లీ హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్లపై కేంద్రం తన స్పందన తెలియజేసింది. ‘వైవాహిక అత్యాచారాన్ని’ నేరంగా పరిగణించాలనే వాదనలను వ్యతిరేకించిన కేంద్రం.. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుసరించలేమని స్పష్టం చేసింది. వరకట్న వేధింపులకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 498 దుర్వినియోగం, వైవాహిక అత్యాచారాన్ని ధ్రువీకరించే యంత్రాంగం లేదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ విషయంలో భారత్ జాగ్రత్తగా ముందుకెళ్లాలనని, సమస్యపై ఇతర దేశాలను గుడ్డిగా అనుసరించకూడదని పేర్కొంటూ లిఖితపూర్వకంగా తెలియజేసింది. ‘అనేక దేశాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు ‘వైవాహిక అత్యాచారాన్ని’ నేరంగా పరిగణించాయి.. అయితే భారతదేశం కూడా వాటిని గుడ్డిగా అనుసరించాలని దీని అర్థం కాదు.. అక్షరాస్యత, మహిళలకు ఆర్థిక సాధికారత లేకపోవడం, సమాజం మనస్తత్వం, విస్తారమైన వైవిధ్యం, పేదరికం మొదలైన అనేక కారణాల వల్ల భారత్‌కు ప్రత్యేక సమస్యలున్నాయి.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే ముందు వీటిని జాగ్రత్తగా పరిశీలించాలి’ అని పేర్కొంది. అంతేకాదు, ఏ చట్టంలో లేదా నిబంధనల్లో నిర్వచించలేదని ఎత్తి చూపింది. IPC సెక్షన్ 375 ప్రకారం అత్యాచారం నిర్వచించినప్పటికీ ‘వైవాహిక అత్యాచారాన్ని’ నిర్వచించడానికి సమాజంలో విస్తృత ఏకాభిప్రాయాన్ని కోరుతుంది.. దీనిని నేరంగా పరిగణించే ముందు ‘వైవాహిక అత్యాచారం’ అంటే ఏంటి? ఏది కాదు? అనే దాని గురించి ఖచ్చితంగా అభిప్రాయాన్ని సేకరించాలి’ అని వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసుల్లోని సాక్ష్యాధారాలపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం నిందితులను దోషిగా నిర్ధారించడానికి బాధితుల వాదన సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. ‘శరీరంపై గాయాలు, ముఖ్యంగా వెనుక లేదా ఛాతీ, ప్రైవేట్ భాగాలపై గుర్తులు లేదా ముద్రలు మొదలైనవి వైద్యపరమైన సాక్ష్యాలు.. నేరాన్ని ఖచ్చితంగా ధ్రువీకరిస్తాయి.. కానీ ‘వైవాహిక అత్యాచారం’ఆరోపణల విషయంలో ఈ సాక్ష్యం పనికిరాకపోవచ్చు.. వివాహిత సమ్మతిని ఎప్పుడు ఉపసంహరించుకున్నారో గుర్తించడం కష్టం.. వైవాహిక అత్యాచారం విషయంలో సందర్భోచిత, ధ్రువీకరించే సాక్ష్యాలు నిష్ఫలమవుతాయి’ అని కేంద్రం తెలియజేసింది. లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన కేంద్రం.. కోర్టులో వాదనలు వినిపించనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి విచారణలో మీ అభిప్రాయాలను ఎప్పుడు వినిపిస్తారని అడిగింది. గత వారం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఈ సమస్యపై కేంద్రం నిర్మాణాత్మక విధానాన్ని పరిశీలిస్తోందని, క్రిమినల్ చట్టానికి సమగ్ర సవరణలపై అనేక మంది అభిప్రాయాలు, సూచనలు కోరిందన్నారు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం అనేది కుటుంబ సమస్యలు, అలాగే స్త్రీ గౌరవాన్ని సూచిస్తుందని దానిని భూతద్దంలో చూడలేమన్నారు. దీనికి మరికొంత సమయం కావాలని కోరారు. ‘‘పెళ్లయినంత మాత్రాన.. బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడినా- మహిళ కేవలం ఇతర సివిల్‌, క్రిమినల్‌ చట్టాలనే ఆశ్రయించాలా? ఐపీసీ- 375 (అత్యాచారం) సెక్షన్‌ ఆ కేసులో వర్తించదా? ఇది సరికాదు’’ అని ధర్మాసనం ఉద్ఘాటించింది. వివాహమైనంత మాత్రాన ఇష్టం లేని శృంగారాన్ని నిరాకరించే హక్కును మహిళలు కోల్పోతారా? అని ప్రశ్నించింది. ఐపీసీ సెక్షన్ 375 పరిధిలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించేలా ఉన్నాయా? అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.


By January 29, 2022 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dont-blindly-follow-west-in-criminalising-marital-rape-says-govt-to-delhi-high-court/articleshow/89192711.cms

No comments