Breaking News

అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ఎలక్ట్రికల్ బస్సు.. 6 గురు మృతి


ఉత్తర్ ప్రదేశ్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రికల్ బస్సు అదుపుతప్పి దూసుకెళ్లడంతో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాన్పూర్ నగరంలోని తాట్ మిల్ క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం సంభవించినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు కార్లు, చాలా ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ ఘటన తర్వాత పరారయ్యాడని కాన్పూర్ తూర్పు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ కుమార్ తెలిపారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు డీసీపీ పేర్కొన్నారు. ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో 9 మంది గాయపడ్డారని చెప్పారు. అదుపుతప్పిన ఎలక్ట్రికల్ బస్సు తొలుత సీసీటీవీ కెమెరాలను అమర్చిన స్తంభాన్ని ఢీకొట్టింది. అనంతరం స్తంభం కూలిపోయినా వాహనం ఆగలేదు. ఆ తర్వాత అది మూడు కార్లను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లి పాదచారులపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడినవారిలో ముగ్గుర్ని పోలీసులు గుర్తించారు. మిగతావారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అంతర్రాష్ట బస్సు టెర్మినల్, రైల్వే స్టేషన్‌కు కూతవేట దూరంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో అర్ధరాత్రి వరకూ రద్దీ కొనసాగుతూ ఉంటుంది. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ప్రమాదంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆమె.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘కాన్పూర్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి దురదృష్టకర వార్తను విన్నాను.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.


By January 31, 2022 at 07:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/six-killed-in-road-accident-due-to-speeding-bus-hitting-peopel-in-kanpur/articleshow/89233567.cms

No comments