Breaking News

407 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరం.. ఫిబ్రవరి 28 వరకూ ఆంక్షలు: కేంద్రం


దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న కొవిడ్‌ నిబంధనలను ఫిబ్రవరి 28 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు ‘విపత్తు నిర్వహణ చట్టం-2005’ కింద నిబంధనలను పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘ప్రస్తుతం ఒమిక్రాన్‌ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు 22 లక్షలు దాటాయి.. కరోనా వైరస్‌ వ్యాప్తి తీరును దృష్టిలో ఉంచుకొని ముందుజాగ్రత్తగా నిబంధనలను పొడిగిస్తున్నాం’’ అని ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ‘దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 407 జిల్లాల్లో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10 శాతంపైనే ఉంది.. ఇది ఆందోళన కలిగించే అంశం.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు. కరోనా కట్టడికి 2021 డిసెంబరు 21న కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు, కోవిడ్ పరిస్థితి ఆధారంగా స్థానిక లేదా జిల్లా యంత్రాంగం తగిన నియంత్రణ చర్యలను కొనసాగించాలని అజయ్ భల్లా సూచించారు. కరోనా కట్టడికి టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, నిబద్ధత ఈ ఐదు సూత్రాల వ్యూహాన్ని కచ్చితంగా అమలుచేయాలని నొక్కిచెప్పారు. కాగా, జనవరిలో జన్యు విశ్లేషణకు వచ్చిన కోవిడ్ బాధితుల నమూనాల్లో దాదాపు 75 శాతం ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్ సుజీత్ సింగ్ అన్నారు. ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో డెల్టా ఆధిపత్యం కొనసాగుతోందని తెలిపారు. ‘‘మనం ఒమిక్రాన్ వేరియంట్‌ని మాత్రమే చూస్తున్నాం అనేది నిజం కాదు.. దేశంలో డెల్టా ఇప్పటికీ ఉంది. వైరస్ తీవ్రతకు డెల్టా కూడా కారణం.. ఆసుపత్రులకు వచ్చే కేసులను ఒమిక్రాన్‌గా పరిగణించకూడదు’’ అని సింగ్ వ్యాఖ్యానించారు.


By January 28, 2022 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/centre-extends-covid-containment-measures-till-february-28/articleshow/89169393.cms

No comments