Breaking News

తీన్మార్ మల్లన్న ఆఫీస్‌పై దాడి.. టీఆర్‌ఎస్ గూండాలే చేశారని మల్లన్న ఆరోపణ


తీన్మార్ మల్లన్నపై దాడి జరిగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ మేడిపల్లిలోని క్యూ న్యూస్ ఆఫీసులోకి కొంతమంది వెళ్లి మల్లన్నను తిడుతూ దాడికి పాల్పడ్డారు. అక్కడున్న కంప్యూటర్లను, టీవీలను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అడ్డుకోవాలనుకునే వారిని తీవ్ర పదజాలంతో తిట్టారు. ఆ తర్వాత ఈ దాడికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మల్లన్న మీడియాకు విడుదల చేశారు. టీఆర్ఎస్ పార్టీ గూండాలే ఈ పని చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఈ దాడిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఛానల్‌ ద్వారా నిజాలను వెల్లడిస్తున్నానని, దానిని జీర్ణించుకోలేకనే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వచ్చిన వారు గూండాలనుకోలేదని వారిని కూర్చోమని మర్యాదలు కూడా చేశామని చెప్పారు. తమ ఆఫీస్‌పై దుండగులు దాడిక పాల్పడుతున్నారని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని, ఇప్పటికైనా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని భౌతిక దాడులు జరిగినా భయపడేదేమి లేదని.. వెనక్కి తగ్గేది లేదని మల్లన్న ప్రకటించారు. బీజేపీలో చేరిన తీన్మార్ మల్లనకు చెందిన క్యూ న్యూస్ మీడియా ట్విట్టర్‌లో ఇటీవల ఓ పోల్‌ను నిర్వహించింది. మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై బాడీ షేమింగ్ కామెంట్‌తో చేసిన ఆ పోల్ వల్ల తీన్మార్ మల్లన్న‌పై టీఆర్ఎస్ పార్టీలో ఆగ్రహం నెలకొంది. దీంతో ఆ పార్టీకి చెందిన వ్యక్తులు ఆ పోల్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా మల్లన్నపై దాడి కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా, అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.


By December 25, 2021 at 09:32AM


Read More https://telugu.samayam.com/latest-news/telangana/unknown-persons-attack-on-thinmar-mallanna-q-office-in-hyderabad/articleshow/88485992.cms

No comments